గత ప్రభుత్వం నిర్మించిన గృహాలను లబ్ధిదారులకు ఇవ్వలేని జగన్ సర్కారు.. కొత్తగా 25 లక్షల గృహాలు ఎలా ఇస్తుందని తెదేపా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లకు సంబంధించి డబ్బులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని... టిడ్కో ఎండీకి చెప్పారు. తెదేపా హయాంలో కట్టిన గృహాలను వైకాపా ప్రభుత్వం నిరూపయోగంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపా హయాంలో రూ.25 వేలు కట్టిన వారికి, మరో రూ.75 వేలు కడితే ఇల్లు ఇస్తామని ఫోన్లు వస్తున్నాయన్నారు. కరోనా వల్ల ఉపాధి లేని పరిస్థితిలో రూ.75 వేలను ప్రజలు చెల్లించలేరని తెలిపారు. ఎన్నికల సమయంలో లబ్ధిదారులు ఎవరు ఇళ్లకు డబ్బులు కట్టవద్దని... అన్ని ఉచితంగా ఇస్తామని వైకాపా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పి డబ్బులు కట్టాలని చెబుతున్నారని ఆగ్రహించారు. ప్రభుత్వం తక్షణమే లబ్ధిదారులకు గత ప్రభుత్వం కేటాయించిన ఇళ్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: