దేశ వ్యాప్తంగా పదివేల ప్రభుత్వ కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్కు ఏర్పాట్లు చేశామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తెలిపారు. నిన్న కొన్ని కేంద్రాల్లో టీకా పంపిణీ జరిగిందని.. నేటి నుంచి పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇరవై వేల కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ టీకా తొలి డోసును కిషన్రెడ్డి తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
తెలంగాణలోనూ 45 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 91 ఉచిత కొవిడ్ వాక్సినేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. 46 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టీకా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అరవై ఏళ్లు పైబడిన, 45 సంవత్సరాలు నిండిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తక్షణమే వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్ తర్వాత కొవిడ్ నియంత్రణ చర్యలను పాటించాలని సూచించారు.
సోమవారం రాష్ట్ర వైద్యోరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ టీకా తీసుకున్నారని.. ఇవాళ తాను కొవాగ్జిన్ టీకాను వేసుకున్నట్లు తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ పట్ల ఎవరూ అపోహలు పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు బయటపడి నేటికి ఏడాది గడిచిందని.. అప్పటి నుంచి గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిరంతరంగా సేవలందించారని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, సికింద్రాబాద్ ప్రజల తరఫున.. వైద్యులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: