రాష్ట్రంలో రహదారులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఆ శాఖ మంత్రి శంకరనారాయణ తెలిపారు. విజయవాడలోని రహదారులు భవనాలశాఖ ప్రధాన కార్యాలయంలో రహదారి అభివృద్ధి సంస్థ 29వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన నిర్వహించారు.
1998లో ఏపీఆర్డీసీ ఏర్పాటైందని... 2014లో తెదేపా ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ఈ సంస్థ నుంచి వివిధ వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని... ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించారని మంత్రి ఆరోపించారు. అప్పు చేసిన మొత్తానికి నెలకు 250 కోట్ల రూపాయలు ఇప్పుడు వడ్డీ చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం ఈ భారం ప్రభుత్వంపై పడిందని... డిసెంబరు నుంచి అసలు, వడ్డీ వాయిదా కట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
పలు ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష
రాష్ట్రంలోని రహదారులు గత ఐదేళ్లుగా నిరాదరణకు గురయ్యాయని.... వాటిని మెరుగు పరచడంతోపాటు.. కొత్త రహదారులు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. విజయవాడలోని కనకదుర్గమ్మ పైవంతెన, బెంజిసర్కిల్ పైవంతెనతోపాటు సుమారు 15 వేల కోట్ల రూపాయలకు చెందిన పనుల శంకుస్థాపన ఈనెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీకి వాయిదా వేశామన్నారు. కేంద్ర మంత్రి నితిన్గడ్కరీ ఈ పనులను దిల్లీ నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారన్నారు. విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్కు సంబంధించిన 352 కిలోమీర్ల మేర 13 రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపైనా సమీక్షించారు. రూ.1104 కోట్లతో సామర్లకోట- రాజానగరం, నాయుడుపేట ఇండస్ట్రియల్ క్లస్టర్, రౌతుసురమాల క్లస్టర్, నక్కపల్లి క్లస్టర్, అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డుకు సంబంధించి ప్రాజెక్టు అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో రహదారి భవనాలశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.కృష్ణబాబు, ఏపీఆర్డీసీ మేనేజింగ్ డైరెక్టర్ పి.సి.రమేష్కుమార్, ఎండీఆర్ భవనాల చీఫ్ ఇంజనీరు కె.నయిముల్లా తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 2014-19 మధ్య పాలకుల ఆర్ధిక వ్యయ నిబద్ధతపై కాగ్ ఆడిట్