IAS officers social service: హైకోర్టు విధించిన సామాజికసేవా శిక్షలో భాగంగా ఆదివారం ఇద్దరు ఐఏఎస్లు ఒక విశ్రాంత అధికారి గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు భోజనం వడ్డించారు. ఇందుకు అయిన ఖర్చులను వారే భరించారు.
- ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం వట్లూరు బాలికల గురుకుల పాఠశాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆదివారం వచ్చారు. విద్యార్థినులతో ముచ్చటించారు. అక్కడ వసతులపై ఆరా తీశారు. ఆంగ్లభాషపై పట్టు సాధించి, ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. తనతోపాటు తీసుకొచ్చిన చాక్లెట్లను విద్యార్థినులకు పంచారు.
![IAS officers social service in welfare hostels in contempt of court issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15107185_as_se-1.jpg)
- పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శ్రీకాకుళంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, వసతి గృహాన్ని ఆదివారం సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డించి సేవ చేశారు. వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు ఒక్కరోజు భోజనానికి అయ్యే ఖర్చుకు సంబంధించిన రూ.19,500 చెక్కును పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు. ఈయన హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాలో 12 నెలల పాటు వివిధ సంక్షేమ వసతి గృహాలను సందర్శించనున్నారు. ఆయన వెంట కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్, డీఈవో పగడాలమ్మ, గిరిజన సంక్షేమశాఖ డీడీ కమల ఉన్నారు.
![IAS officers social service in welfare hostels in contempt of court issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15107185_as.jpg)
- విజయనగరంలోని గిరిజన బాలుర వసతి కేంద్రానికి విశ్రాంత ఐఏఎస్ అధికారి వి.చినవీరభద్రుడు వచ్చారు. ఆదివారం ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 3.45 గంటల వరకు కేంద్రంలోని విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మెనూ ప్రకారం ఒక విద్యార్థికి రూ.15 చొప్పున 165 మందికి భోజనానికి అయ్యే ఖర్చు రూ.2,475 చెల్లించారు. స్వయంగా భోజనాన్ని వడ్డించారు. ఆయన వారితో కలిసి భోజనం చేశారు. గ్రూప్స్, సివిల్స్ కొలువులు ఎలా సాధించాలో వివరించారు.
![IAS officers social service in welfare hostels in contempt of court issue](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15107185_as_se-2.jpg)
నేపథ్యమిదే: ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, నిర్మాణాలు సరికాదని, వాటిని తొలగించాలని 2020 జూన్ 11న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఏడాదికి పైగా ఆ ఉత్తర్వులను అధికారులు పట్టించుకోలేదు. దీంతో 2021 జులై 12న అప్పటి పంచాయతీరాజ్, పురపాలకశాఖ, పాఠశాల విద్యాశాఖకు చెందిన సీనియర్ ఐఏఎస్లపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేసింది. తర్వాత కాలంలో ఆ శాఖల బాధ్యతలను నిర్వహించిన ఐఏఎస్లను ప్రతివాదులుగా చేర్చింది. దీంతో మొత్తం 8 మంది ఐఏఎస్లపై సుమోటో కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి విచారణ జరిపి.. తీర్పును వెల్లడించింది.
న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన 8 మంది ఐఏఎస్ అధికారులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో వీరికి రెండు వారాల సాధారణ జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ శిక్ష పడినవారిలో గోపాల కృష్ణ ద్వివేది (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి), ఎం.గిరిజాశంకర్ (పౌరసరఫరాలశాఖ కమిషనర్, పంచాయతీరాజ్శాఖ పూర్వ కమిషనర్), బి.రాజశేఖర్ (పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి), వాడ్రేవు చిన వీరభద్రుడు (గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్, పాఠశాల విద్య పూర్వ కమిషనర్), జె.శ్యామలరావు (ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి), వై.శ్రీలక్ష్మి (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ, పూర్వ ముఖ్య కార్యదర్శి), జి.విజయకుమార్ (ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి, పురపాలకశాఖ పూర్వ డైరెక్టర్), ఎం.ఎం నాయక్ (పురపాలకశాఖ కమిషనర్, పురపాలకశాఖ పూర్వ డైరెక్టర్) ఉన్నారు. శిక్ష విధింపుపై కోర్టుకు ఏమైనా చెప్పదలచుకున్నారా? అని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అడిగిన ప్రశ్నకు ఐఏఎస్లు ఒకరి తర్వాత ఒకరుగా క్షమాపణలు కోరారు. ఆదేశాల అమలులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుంటామని చెప్పారు. ఇప్పటివరకూ అందించిన సేవలు, వయసును దృష్టిలో పెట్టుకొని క్షమించాలని కోరారు. ఆ క్షమాపణలను మానవతా దృక్పథంతో న్యాయస్థానం అంగీకరించాలంటే.. సామాజిక సేవ చేసేందుకు సిద్ధమేనా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు వారు అంగీకారం తెలపడంతో.. ఏడాదిపాటు నెలకోసారి ఏదో ఒక ఆదివారం సాంఘిక సంక్షేమ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో కొంత సమయం గడపాలని ఐఏఎస్లకు న్యాయమూర్తి స్పష్టం చేశారు. విద్యార్థులకు ఆ పూట భోజనం ఖర్చులను సొంతంగా భరించాలని ఆదేశించారు. ఏయే జిల్లాలకు ఎవరెవరు వెళ్లాలో న్యాయమూర్తే తెలిపారు. ప్రతి నెలా వసతి గృహాలను సందర్శించిన వివరాలు, ఫొటోలను హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు పంపాలని స్పష్టంచేశారు. ఇలా చేయడంలో విఫలమైతే వారిపై కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు రిజిస్ట్రీ తిరిగి తెరిచేందుకు వెసులుబాటు ఇచ్చారు. అధికారులకు జైలుశిక్షను నిలుపుదల చేస్తూ.. సామాజిక సేవా శిక్షను విధించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ తీర్పు వెల్లడించారు.
ఇదీ చదవండి: