high court on movie tickets : ప్రభుత్వం నిర్వహించే వెబ్సైట్ ద్వారా మాత్రమే సినిమా టికెట్ల విక్రయం గుత్తాధిపత్యానికి దారి తీస్తుందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. థియేటర్ల యాజమాన్యాలు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వెబ్సైట్ల ద్వారా టికెట్లు విక్రయిస్తే తప్పేముందని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వచ్చే సోమవారంలోగా పరిష్కారం కనుగొనాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. లేకుంటే తామే సంబంధిత జీవో అమలును నిలుపుదల చేస్తామని హెచ్చరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వమే ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించేందుకు వీలుగా డిసెంబర్ 17న జారీ చేసిన జీవో 142ను సవాలు చేస్తూ ‘మల్టీఫ్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ తరఫున మంజీత్సింగ్, మరొకరు హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ప్రభుత్వ నిర్ణయం థియేటర్ల యాజమాన్యాల ప్రాథమిక హక్కులను హరించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం సోమవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.
ఇదీ చదవండి: వివేకా కేసు నిందితుల పిటిషన్.. తోసిపుచ్చిన హైకోర్టు