దేశీయ బొగ్గు గనులపై ఆధారపడటం వల్లే ఇంధన కొరత ఏర్పడినట్లు..ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఆర్టీపీపీ, వీటీపీఎస్లో రెండ్రోజుల నిల్వలే ఉన్నాయన్నారు. కొవిడ్ వల్ల 20 శాతం విద్యుత్ వినియోగం పెరగడంతో..బొగ్గు నిల్వలు నిండుకున్నట్లు తెలిపారు. బొగ్గు కొరతపై కేంద్రానికి కూడా లేఖ రాశామని..త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని తెలిపారు.
కొన్నాళ్లుగా దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది. 135 విద్యుత్ కేంద్రాల్లో 4 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. ఏపీ జెన్కోకు రావాల్సిన ర్యాక్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ఆర్టీపీపీ, వీటీపీఎస్లో రెండ్రోజుల నిల్వలే ఉన్నాయి. అంతర్జాతీయంగా బొగ్గు ధర రెండు, మూడు రెట్లు పెరిగింది. దేశీయ బొగ్గు గనులపైనే ఆధారపడటంతో ఒత్తిడి నెలకొంది. బొగ్గు కొరతపై కేంద్రానికి కూడా లేఖ రాశాం. ప్రస్తుతం 190 మిల్లీ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉంది. కొవిడ్ వల్ల 20 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ డిమాండ్ దేశవ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. జలవిద్యుత్ కేంద్రాల నుంచి 20 మిలియన్ యూనిట్లు సరఫరా. సౌర, పవన విద్యుత్ సరఫరా వల్ల రెండేళ్లుగా ఒప్పందం చేసుకోలేదు.- శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి
కేంద్రానికి లేఖ..
‘అంతర్జాతీయ ఇంధన సంక్షోభంతో ఐరోపా, చైనాల్లో విద్యుత్తు ఛార్జీలు మూడు రెట్లు పెరిగాయి. ఈ సంక్షోభం భారతదేశాన్ని తాకేలా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ అనంతర పరిస్థితుల్లో గడిచిన ఆరునెలల్లో 15% విద్యుత్తు డిమాండు పెరిగింది. గడిచిన ఒక్క నెలలోనే 20% డిమాండు పెరిగింది. బొగ్గు కొరత రెట్టింపు కావడం దేశ ఇంధన రంగాన్ని సంక్షోభంలోకి నెడుతోంది. ఈ సంక్షోభం విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఈ ఇబ్బందులను అధిగమించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’ అని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం లేఖ రాశారు. అందులోని అంశాలు ఇలా ఉన్నాయి.
ఈ చర్యలు తీసుకోవాలి...
- ఆంధ్రప్రదేశ్లోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్లు కేటాయించేలా బొగ్గు మంత్రిత్వ శాఖకు, రైల్వేలకు సూచించాలి.
- దేశంలో ఉత్పత్తి నిలిపివేసిన థర్మల్ విద్యుత్తు కేంద్రాలను తక్షణమే పునరుద్ధరించాలి.
- ఆంధ్రప్రదేశ్లో పనిచేయకుండా ఉన్న 2,300 మెగావాట్ల సహజవాయు విద్యుత్తు ప్లాంట్లను పని చేయించాలి. వాటికి ఓఎన్జీసీ, రిలయన్స్ సంస్థల నుంచి అత్యవసర ప్రాతిపదికన సహజవాయువు సరఫరా చేయాలి.
- నిర్వహణ పనుల కోసం కేంద్ర విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు 500 మెగావాట్ల విద్యుత్తు ప్లాంట్లను నిలిపివేశాయి. వాటిలోనూ తక్షణమే ఉత్పత్తి చేయించాలి.
- డిస్కంలకు అవసరమైన పెట్టుబడిని బ్యాంకులు, రుణసంస్థలు అప్పుల రూపంలో ఇచ్చేలా మార్గదర్శకాలు జారీచేయాలి.
ఇదీ పరిస్థితి
- ఆంధ్రప్రదేశ్ రోజూ 185 నుంచి 190 మిలియన్ యూనిట్లు గ్రిడ్కు అందించాల్సి వస్తోంది. రాష్ట్ర విద్యుత్తు అవసరాల్లో 45% సరఫరా చేస్తున్న జెన్కో విద్యుదుత్పత్తి ప్లాంట్ల వద్ద ఒకటి రెండు రోజులకు సరిపడే బొగ్గు ఉంది. ఆ తర్వాత వీటి విద్యుత్తు ఉత్పత్తికి ఇబ్బంది కలుగుతుంది.
- ఏపీ జెన్కో ఉత్పత్తి సంస్థలు రోజూ 90 మి.యూ. విద్యుత్తు ఉత్పత్తి చేయాల్సి ఉన్నా బొగ్గు కొరతతో అందులో సగానికే పరిమితమయ్యాయి. కేంద్ర ఉత్పత్తి సంస్థలూ రోజూ 40 మి.యూ. ఉత్పత్తి చేయాల్సి ఉన్నా అందులో 75% మాత్రమే పనిచేస్తున్నాయి. 8వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు సామర్థ్యం పెంచుకోవాలనుకునే క్రమంలో థర్మల్ విద్యుత్తు కేంద్రాలతో ఉన్న ఒప్పందాలను ఏపీ వినియోగించుకోలేని పరిస్థితుల్లో ఉంది. విద్యుత్తు కొరత వల్ల అధికధరలు పెట్టి కొనాల్సి వస్తోంది. 2021 సెప్టెంబరు 15న సగటున యూనిట్కు రూ.4.6 ఉంటే అక్టోబరు 8 నాటికి అది రూ.15కు పెరిగింది. రియల్ టైమ్లో ఈ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. యూనిట్కు రూ.20 వెచ్చించి కొనాల్సి వస్తోంది.
- దేశంలో విద్యుత్తు ఉత్పత్తి కొరతతో కొన్ని కీలక సమయాల్లో కొనుగోలుకు విద్యుత్తు అందుబాటులో ఉండటం లేదు.
- ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. డిస్కంల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. వ్యవసాయానికి విద్యుత్తు అందించకపోతే పంటలు ఎండిపోతాయి. విద్యుత్తు కోతలు ప్రారంభమైతే 2012 నాటి విద్యుత్తు సంక్షోభం ఏర్పడే పరిస్థితులు వస్తాయి. గ్రిడ్ డిమాండ్ను అందుకోలేని ఇబ్బందులు మాకు వస్తాయి. అందువల్ల తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలి.
ఇదీ చదవండి
CM Jagan Letter to PM Modi: 'విద్యుత్ సంక్షోభం తీర్చేందుకు జోక్యం చేసుకోండి'