కరోనా కట్టడి చర్యలపై..తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్కు అధికారులు గణాంకాలను వివరించారు. రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు.. 4.46 శాతంగా ఉందని చెప్పారు. గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, కడప, అనంతపురం, విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 కంటే తక్కువగా ఉందని వివరించగా... ఈ 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించాలని సీఎం ఆదేశించారు. కొవిడ్ తీవ్రత తగ్గినందున ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలించాలన్నారు. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా ఎక్కువగా ఉన్న ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవని.., సాయంత్రం 6 గంటల వరకే కార్యకలాపాలు పరిమితం చేయాలని స్పష్టం చేశారు. జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తిస్తాయని, ఆ తర్వాత పాజిటివిటీ రేటు పరిశీలించి మరిన్ని సడలింపులపై నిర్ణయం ఉంటుందన్నారు.
సమీక్షలో భాగంగా కరోనా మూడో వేవ్ను ఎదుర్కొనే కార్యచరణనూ..అధికారులు సీఎంకు వివరించారు. థర్డ్వేవ్ ముప్పుపై ఇప్పటికే మూడుసార్లు నిపుణులతో..వెబినార్ నిర్వహించామని తెలుపగా...అందులో చర్చించిన అంశాలపై కొత్త వైద్యులకూ అవగాహన కలిగించాలని సీఎం ఆదేశించారు. 104 కాల్సెంటర్ ద్వారా పిల్లలకు 24 గంటలూ పీడియాట్రిక్ టెలీ సేవలు ఉండాలన్నారు. 150 మంది పీడియాట్రిషియన్లను టెలీ సేవలకు అందుబాటులో ఉంచాలన్న సీఎం...సేవలు ప్రారంభించే ముందు వారందరికీ శిక్షణ ఇప్పించాలన్నారు. దీని కోసం ఎయిమ్స్ లాంటి అత్యుత్తమ సంస్ధల నిపుణుల సేవలను వినియోగించుకోవాలన్నారు. కొవిడ్ బాధితులకు సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్తో 253 మంది చనిపోగా..1441 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు.
ఇదీ చదవండి
CURFEW RELAX: రాష్ట్రంలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు