లాక్డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనున్న కారణంగా అప్పటివరకూ ఆలయంలో భక్తులకు శ్రీనివాసుడి దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు తితిదే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, సేవా టిక్కెట్లను పొందిన భక్తులు వాటిని వాయిదా వేసుకునేందుకు, లేదా రద్దు చేసుకుంటే నగదు చెల్లింపునకు తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా ఏటా నిర్వహించే హనుమంత వాహనసేవను ఈ దఫా రద్దు చేసింది. శ్రీరామనవమి ఆస్థానాన్ని, 3న శ్రీరామ పట్టాభిషేక వేడుకను ఏకాంతంగా నిర్వహించనుంది. ఏప్రిల్ 5 నుంచి 7 వరకు మూడు రోజులపాటు సాగే వార్షిక వసంతోత్సవాలను శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో ఏకాంతంగా జరపనుంది. తితిదే ఆధ్వర్యంలో తిరుపతిలోని పేదలకు, వలస కార్మికులకు, యాచకులకు పూటకు 50 వేల మందికి ఆహార పొట్లాలను తితిదే తిరుమల అన్నదాన కేంద్రంలో తయారుచేసి అందిస్తోంది.
శ్రీవారి కైంకర్యాల్లో లోపంలేదు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నిత్య కైంకర్యాలు, నివేదనల్లో ఎలాంటి లోపం, అపచారం జరగలేదని శ్రీశఠగోప రామానుజ పెద్దజియ్యంగార్ వెల్లడించారు. తిరుపతిలోని తన మఠంలో చిన్నజియ్యంగార్తో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆరిపోయినట్లు వస్తున్న వదంతులను కొట్టిపారేశారు.