Water Problem In Kavali: నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఎండా కాలం మొదలవడంతో తాగడానికి సైతం నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ మహిళలు ఖాళీ బిందెలతో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. వేసిన బోర్లు పనిచేయడంలేదని, పైప్ లైన్ ద్వారా తాగునీటి సరఫరా చేయట్లేదని మహిళలు వాపోయారు. రెండు నెలల నుంచి వార్డులో నీటి సరఫరా సక్రమంగా లేదంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవట్లేదన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి లో 40 వ వార్డులు ఉన్నాయి. తాగునీటి సమస్య తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లు ఖర్చు పెడుతున్న క్షేత్రస్థాయిలో అమలు కాని పరిస్థితి కనిపిస్తుంది. పట్టణంలోని వెంగల్ రావు నగర్, తుఫాన్ నగర్, ఇందిరమ్మ కాలనీ, ముసునూరు, బుడమగుంట కాలనీ ప్రాంతాల్లో త్రాగు నీటి సమస్య అధికంగా ఉందని, రెండు నెలల నుంచి వార్డులో నీటి సరఫరా సక్రమంగా లేదంటూ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి పనితీరు సక్రమంగా లేదని స్థానిక మహిళలు ఆయనపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా పురపాలక శాఖ అధికారులు స్పందించి రోజు మార్చి రోజు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: " తెలుగు సినీ పరిశ్రమపై... వైకాపా ప్రభుత్వం తీరు మార్చుకోవాలి"