నిండుగా నీళ్లున్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇది! అధికారుల ప్రణాళికలు పక్కాగా అమలైతే ఈపాటికి జలాశయంలోని నీళ్లు కాల్వల్లో పారేవి. ఇప్పుడే కాదు.. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వల్లో నీళ్లు చూడాలని, వాటితో సాగు చేసుకోవాలని అనేక మంది రైతులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. రిజర్వాయర్లో నిండుగా నీళ్లున్నా అవి తమ పొలాలను తడిపే అవకాశం లేకపోవడంతో నిస్సహాయత వ్యక్తంచేస్తున్నారు.
వైఎస్ఆర్ జిల్లా గండికోట జలాశయంలో దాదాపు 23 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ప్రస్తుతం 8 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మైలవరం, వామికొండ, సర్వారాయసాగర్ జలాశయాలను కూడా కలిపితే సుమారు 40 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. ఐతే.. ఖరీఫ్లో పంటలు, పరిశ్రమలు, తాగునీటి అవసరాలకు కలిపి కేవలం 17 టీఎంసీలు మాత్రమే వాడుకోగలరని జలవనరులశాఖ అధికారులు అంచనాలు వేశారు. ఆయా జలాశయాల కింద లక్షా 94 వేల 716 ఎకరాల ఆయకట్టుంటే... కేవలం లక్షా 19 వేల ఎకరాలకే ఖరీఫ్లో నీళ్లివ్వగలమని... అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. ఇందులోనూ సింహభాగం ఆయకట్టు బోర్లకిందే సాగవుతోందని వాళ్లే అంగీకరిస్తున్నారు. జలాశయాలనుంచి పంటపొలాలకు నీళ్లు తరలించే..కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాల్వలు.. నిర్మించకోపోవడంతో.. నీళ్లున్నా వాడుకోలేని పరిస్థితి నెలకొంది. గతేడాది కూడా గండికోటలో పూర్తిస్థాయి నీరున్నా కాల్వలు అందుబాటులోకి రాక కేవలం 2 టీఎంసీలే.. వాడుకోగలిగారు. ఈసారీ అదేపరిస్థితి కనిపిస్తోంది.
గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ జలాశయానికి 5 దశల్లో8టీఎంసీల నీరు ఎత్తిపోయడానికి 2,059 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు. తద్వారా 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించాలని. ప్రణాళికలు వేశారు. గండికోట నుంచి చిత్రావతికి తెచ్చిన నీటిని లింగాల కుడి కాలువ, పులివెందుల బ్రాంచి కాలువ ద్వారా ఆయకట్టుకు నీరందించాల్సి ఉంటుంది. ఐతే.. డిస్ట్రిబ్యూటరీలు ఇంకా పూర్తికాలేదు. పనులు అసంపూర్తిగా వెక్కిరిస్తున్నాయి. అవెప్పుడు పూర్తవుతాయా, తమ పొలాలు ఎప్పుడు తడుస్తాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
చిత్రావతి జలాశయం కింద ఉన్న 12 వేల ఎకరాల ఆయకట్టుతోపాటు లింగాల ప్రధాన కాలువ, పులివెందుల బ్రాంచి కాలువ, పైడిపాలెం ద్వారా మొత్తం లక్షా 26 వేల 300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించాలనేది.. ప్రణాళిక. కానీ అది కాగితాలు దాటేలా లేదు. లింగాల కాలువ 53 కిలోమీటర్ల మేర తవ్వారు. మధ్యలో అనేక పనులు...... ఇంకా పెండింగులో ఉన్నాయి. లింగాల కుడి కాలువ నుంచి గ్రావిటీ ద్వారా సుమారు 30 వేల ఎకరాలకు, సూక్ష్మ సేద్యం ద్వారా 29 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్దేశించుకున్నారు. లింగాల కుడి కాలువ మీద దాదాపు 23 చోట్ల ఎత్తిపోతల పథకాలు నిర్మించి.. చెరువులు, చెక్ డ్యాంలకు నీళ్లు మళ్లించాలని ప్రణాళిక వేశారు. ఐతే ఎత్తిపోతల సంఖ్యను 23 నుంచి 17కు కుదించారు. పోనీ అవన్నా పూర్తిచేశారా అంటే ఒక్కటీ కొలిక్కిరాలేదు. ఇవిగో సంపులు, ఇతరత్రా పనులు ఇలా అసంపూర్తిగానే ఉన్నాయి. ఫలితంగా.... కొన్ని చోట్ల చెరువులూ నింపలేని.... దుస్థితి నెలకొంది. లింగాల కుడికాలువ ఆయకట్టుకు ప్రత్యక్షంగా నీళ్లిచ్చే వ్యవస్థ నేటికీ అందుబాటులోకి రాలేదు. ఫలితంగా బోర్ల కింద రైతులు సాగుచేసుకుంటున్నారు. అందంతా.... పరోక్ష ఆయకట్టుకింద అధికారులు చూపిస్తున్నారు.
ఇక చిత్రావతి రిజర్వాయర్ కింద సూక్ష్మ సేద్యం పనులు కూడా... అంతంత మాత్రంగానే ఉన్నాయి. లింగాల కాలువ కింద 39 వేల400 ఎకరాలకు... రూ.419 కోట్లతో పైడిపాలెం కింద 37,500 ఎకరాలకు రూ.367 కోట్లతో, పులివెందుల బ్రాంచి కాలువ కింద 45,500 ఎకరాలకు రూ.470 కోట్లతో.... పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచారు. పులివెందుల బ్రాంచి కాలువ కింద మాత్రమే పనులు చేస్తున్నారు. ఇంకా 250 కిలోమీటర్ల మేర వివిధ కాలువల పనులు.. చేయాల్సి ఉంది. పూడిపోయిన కాలువలు బాగు చేయాల్సి ఉంది. కేవలం.... 40 కిలోమీటర్ల మేర మాత్రమే కొంత పని చేసినట్లు తెలుస్తోంది. లింగాల, పైడిపాలెం కింద సూక్ష్మేద్యం పనులు అసలు మొదలేకాలేదు. గడిచిన మూడేళ్లుగా... డిస్ట్రిబ్యూటరీ పనుల విషయంలో....ఆశించిన పురోగతి లేకపోవటం ఆయకట్టు సాగుకు శాపంగా మారింది.
ఇదీ చదవండి: మంచినీటి చెరువు ఆవేదన.. ఆలోచింపజేస్తున్న ఫ్లెక్సీ