గుంటూరు జిల్లా మున్సిపల్ వైస్ ఛైర్మన్, వైకాపా నాయకుడు కొలిశెట్టి శ్రీనివాసరావుపై.. రాళ్ల దాడి జరిగింది. శనివారం సాయంత్రం విశ్వనాథ్ థియేటర్ సెంటర్లో టీ తాగుతుండగా.. ఆయనపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో కొలిశెట్టి శ్రీనివాసరావు తల పగిలింది. తీవ్రంగా రక్తస్రావమైంది. రక్తం కారుతూనే పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన.. దాడిపై ఫిర్యాదు చేశారు. వైకాపాకే చెందిన దరియావలీ.. మరికొందరితో కలిసి దాడి చేసినట్లు పేర్కొన్నారు. దరియావలీ సహా నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పట్టుబట్టారు. అప్పటిదాకా అక్కడి నుంచి వెళ్లేది లేదంటూ భీష్మించారు.
కొలిశెట్టి శ్రీనివాసరావుపై దాడి గురించి తెలుసుకుని పెద్దసంఖ్యలో పోలీస్స్టేషన్కు చేరుకున్న ఆర్యవైశ్యులు.. నిందితుల అరెస్టుకు డిమాండ్ చేశారు. మున్సిపల్ వైస్ఛైర్మన్ను రక్తం వచ్చేలా కొట్టిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విషయం తెలుసుకున్న కొందరు వైకాపా నాయకులు.. పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని శ్రీనివాసరావుకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రాళ్లతో కొట్టిన వాళ్లను అరెస్టు చేసే వరకూ వెనక్కి తగ్గేది లేదన్నారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల వరకూ మద్దతుదారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుటే ఉండటంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మెప్మాలో పనిచేస్తున్న మహిళ తొలగింపుతో వివాదం..
మెప్మాలో పనిచేస్తున్న ఓ మహిళను తొలగించడమే ఈ గొడవంతటికీ కారణమైంది. ఈ విషయంపై వైస్ చైర్మన్ శ్రీనివాసరావు, సుభానీనగర్కు చెందిన వైకాపా నాయకుడు దరియావలీ అలియాస్ శివమణి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. రిసోర్స్ పర్సన్గా ఉన్న మహిళ పనితీరుపై సుభానీనగర్ వాసులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం ఎమ్మెల్యే కార్యాలయానికి చేరింది. ఆ తర్వాత కొన్నిరోజులకే రిసోర్స్ పర్సన్ను తొలగించారు. తన మాట వినకుండా రిసోర్స్ పర్సన్ను తొలగించడంపై కినుక వహించిన శ్రీనివాసరావు.. నాలుగు రోజుల క్రితం సుభానీనగర్కు వెళ్లారు. అక్కడ దరియావలీ వర్గం ఆయనతో ఘర్షణకు దిగింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే విడదల రజిని మరిది విడదల గోపి.. ఇరువర్గాలను పిలిపించి సర్దిచెప్పారు. అప్పటికి విభేదాలు సద్దుమణిగినట్లే కనిపించినా.. శనివారం కొలిశెట్టి శ్రీనివాసరావుపై జరిగిన దాడితో మరింత తీవ్రమయ్యాయి.
ఇదీ చదవండి:
రోదసిలోకి అడుగు పెడుతున్న తొలి తెలుగు మహిళ
Kathi Mahesh: నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ కన్నుమూత.. నేడు స్వగ్రామంలో అంత్యక్రియలు