Cold Storages: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పవర్ హాలిడే... గుంటూరు జిల్లాలోని శీతల గోదాముల నిర్వాహకులను ఆందోళనకు గురిచేస్తోంది. కరెంటు సరఫరా లేకపోతే గోదాముల్లోని సరుకు పాడైపోతుంది. సరుకును కాపాడాలంటే జనరేటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. అయితే పెరిగిన డీజిల్ ధరలతో జనరేటర్ల వాడకం కూడా గిడ్డంగుల యజమానులకు భారంగా మారుతోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో... సుమారు 150వరకు శీతల గోదాములున్నాయి. ఇక్కడ మిర్చి యార్డు ఉండటంతో వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు అనువుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఎక్కువగా శీతల గోదాములు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని గోదాములు 50శాతానికి పైగా మిర్చి నిల్వలతో నిండిపోయాయి. వీటి నిర్వహణకు విద్యుత్ ఎంతో కీలకం. సరకు పాడైపోకుండా ఉండాలంటే.... 8 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. కొద్దిరోజులుగా కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్న గిడ్డంగుల యజమానులు... పవర్ హాలిడే ప్రకటనతో నిర్వహణ ఎలా అని తలలు పట్టుకుంటున్నారు.
గతంలో కరెంటు సరఫరా సమస్యలు వచ్చినప్పుడు శీతల గిడ్డంగుల యజమానులు జనరేటర్లు వినియోగించేవారు. కానీ ప్రస్తుతం వేళాపాళా లేని కరెంటు కోతలు, పెరిగిన డీజిల్ ధరలతో జనరేటర్ల నిర్వహణా వ్యయం పెరిగిందని శీతల గిడ్డంగుల యజమానులు చెబుతున్నారు. సరుకు పాడైతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని శీతల గోదాముల యజమానుల సంఘం అధ్యక్షుడు ప్రకాశ్ అన్నారు. రైతులు, వ్యాపారులు నష్టపోకుండా ఉండేందుకు కరెంటు సరఫరా చేయాలని శీతల గోదాముల యజమానులు కోరుతున్నారు..
ఇదీ చదవండి: Eluru fire accident: ఏలూరు అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని సహా ప్రముఖుల దిగ్బ్రాంతి