పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశం గందరగోళంగా మారింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇంటి స్థలాన్ని మంజూరు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, జిల్లాలో భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణ వల్ల ప్రభుత్వంపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైకాపా ఎమ్యెల్యేలు..... మంత్రికి తెలియజేశారు. మొన్నటివరకు ప్రజలు, రైతులు తమను సన్మానించారన్న ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు.. ఇప్పుడు బయటకు వెళ్తుంటే రైతులు కోపంగా చూస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో మరింత దారుణ పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. మరోవైపు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజును వేదికపైకి ఆహ్వానించకపోవడంతో అధికారులతో పాటు కిందే కూర్చున్నారు. ప్రొటోకాల్ పాటించలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీ వేదికపైకి పిలవకుండా అవమానించారంటూ నిరసన తెలిపి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: