యుక్తవయస్సు పొగబారుతోంది. బడికెళ్లే విద్యార్థులూ పొగాకు ఉత్పత్తులకు అలవాటుపడుతున్నారు. 13-15 ఏళ్ల ప్రాయంలోనే వాటికి బానిసలవుతున్నారు. ఈ వయసులోనే ఏదోఒక రకమైన పొగాకు ఉత్పత్తికి అలవాటు పడినవారు 18.1 శాతం మంది ఉండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వీరిలో బాలురే కాదు.. బాలికలూ పెద్దసంఖ్యలో ఉండటం గమనార్హం. దేశం మొత్తమ్మీద అత్యధికంగా పొగాకు ఉత్పత్తుల వినియోగం అరుణాచల్ప్రదేశ్, మిజోరంలలో 58 శాతం నమోదు కాగా.. అతి తక్కువగా హిమాచల్ప్రదేశ్లో 1.1 శాతంగా నమోదైంది. టీనేజీ విద్యార్థినీ విద్యార్థుల్లో తెలంగాణలో 5.2 శాతం మంది పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్లో 2.6 శాతం మంది వాటిని వాడుతున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
![](https://assets.eenadu.net/article_img/gh-story1a_46.jpg)
ఏమిటీ సర్వే?
భారత్లో బడికెళ్లే విద్యార్థుల్లో పొగాకు ఉత్పత్తుల వాడకంపై ‘ది గ్లోబల్ యూత్ టొబాకో సర్వే(జీవైటీఎస్)’ ఆధ్వర్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ సర్వే నిర్వహించింది. ‘ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాప్యులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్)’ సహకారంతో 2019లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ అధ్యయనాన్ని చేపట్టారు. దేశవ్యాప్తంగా 987 పాఠశాలల (544 ప్రభుత్వ, 443 ప్రైవేట్) నుంచి 97,302 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో 80,772 మంది 13-15 ఏళ్ల మధ్యవయస్కులే. పాల్గొన్నవారిలో 96.9 శాతం మంది సమాధానాలిచ్చారు. సర్వే సమాచారాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల విడుదల చేసింది.
11 శాతం మందికి ఇంట్లోనే తొలిసారి..
ఇంట్లోనే ధూమపానాన్ని తొలిసారిగా అలవాటు చేసుకున్న విద్యార్థులు 11.2 శాతం మంది ఉన్నట్లు సర్వేలో తేలింది. అబ్బాయిల్లో 13.1 శాతం మందికి ఇంట్లోనే తొలిసారిగా అలవాటైంది. ఇంట్లో పెద్దవారు పొగాకు ఉత్పత్తులను వాడుతుండటాన్ని పరిశీలించిన యువత వారి అడుగు జాడల్లో నడుస్తున్నట్లుగా సర్వేలో వెల్లడైంది. సాధారణంగా పెద్దలు చేసే పనులను పిల్లలు అనుసరిస్తుంటారని, వారి ఎదుట పొగాకు ఉత్పత్తులను వాడకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు
బడి సమీపంలో, దారిలో, వీధి చివర నిబంధనలను ఉల్లంఘించి చిన్న వయసువారికీ పొగాకు ఉత్పత్తులను అమ్ముతుండడంతో వారు వాటి బారిన పడటానికి ఆస్కారమిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కిరాణా దుకాణాల్లో 39.7 శాతం, పాన్ షాపుల్లో 25.2 శాతం సిగరెట్లు లభిస్తున్నాయని సర్వే చెబుతోంది. ప్రస్తుతం సిగరెట్లు తాగుతున్నవారిలో 69 శాతం మంది, బీడీలు తాగుతున్నవారిలో 78 శాతం మంది సమీపంలోని కిరాణా దుకాణం, పాన్ షాపు, వీధి చివర దుకాణాల్లోనే కొనుగోలు చేస్తున్నారు. వయసు తక్కువగా ఉందనే కారణంతో పొగాకు ఉత్పత్తులను అమ్మడానికి నిరాకరించినవారు 54.7 శాతం మంది వరకూ ఉండటం కొంత ఊరటనిచ్చేదే. ఇతరులు పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల తమ ఆరోగ్యానికీ హాని కలుగుతుందని తెలిసిన విద్యార్థులు 70.6 శాతం మంది, ఈ విషయాన్ని ప్రచార చిత్రాల ద్వారా తెలుసుకున్నవారు 52 శాతం మంది ఉన్నారు. గత 12 నెలల్లో ప్రతి 10 మందిలో ఇద్దరు పొగాకు ఉత్పత్తులను మానేయాలని యత్నించారు. ఇందులో 25 శాతం మంది బాలురు.. 13 శాతం మంది బాలికలున్నారు.
![](https://assets.eenadu.net/article_img/gh-story1b_28.jpg)
ఇదీ చూడండి: