Women Success Story: కష్టమనుకుంటే ఏదీ చేయలేం... కానీ అదే ఇష్టంగా భావించి కృషి చేస్తే విజయం దానంతట అదే వస్తుందనడానికి నిదర్శనం ఈ నలుగురు నారీమణులు. వరంగల్కు చెందిన ఉమాదేవి, రమాదేవి, ఉషారాణి, అర్చనలు...పెళ్లి చేసుకుని వంటింటికే పరిమితం కాకుండా... పాకశాస్త్రాన్నే ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. తెలుగు సంప్రదాయ పిండి వంటకాలు నేటి తరం మరచిపోకూడదనే ఉద్దేశంతో... శ్రీనిధి తెలంగాణ పిండివంటశాలను ఏర్పాటు చేశారు.
నలుగురితో ప్రారంభమై...
2016లో నలుగురుతో ప్రారంభించిన ఈ వంటశాలలో ఇప్పుడు 70 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరు సకినాలు, పల్లిగారెలు, పప్పుగారెలు, పల్లిఉండలు, సర్వపిండి, మడుగులు, అరిసెలు అన్ని రకాల పిండివంటలు తయారుచేస్తూ... విదేశాలతోపాటు వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. నాణ్యత, శుభ్రతకు పెద్దపీట వేయడంతో... ప్రారంభించిన కొద్ది కాలంలోనే మూడు చోట్ల పిండివంటల దుకాణాలను ప్రారంభించారు. నిర్వాహకులు, పనిచేసేవాళ్లూ అంతా మహిళలే కావటంతో ఎలాంటి ఇబ్బందులు ఉండడంలేదు.
మంచి స్పందన...
పిండివంటలకు అవసరమైన వస్తువులు మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం, పనివాళ్లతో చేయించడం, ప్యాకింగ్ వంటి పనులను విభజించుకుంటున్నారు. మగవారి సంపాదనపై మహిళలు ఆధారపడకూడదని... ఆర్ధికంగా బలపడినప్పుడే వారికి గౌరవం ఉంటుందని అంటున్నారు. వారాంతం, పండుగ రోజుల్లోనూ రద్దీ బాగా ఉండడంతో... పిండివంటలన్నీ హాట్కేకుల్లా అమ్ముడవుతున్నాయి. నోరూరించే రుచి, నాణ్యత పాటించడం, సకాలంలో అందించడం వల్ల తరచూ ఇక్కడే కొంటున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. కొనుగోలుదార్ల నుంచి మంచి స్పందన వస్తుండడంతో... త్వరలో హైదరాబాద్, ఇతర ముఖ్యపట్టణాల్లో పిండివంటశాలను ఏర్పాటు చేయాలని నిర్వాహకులు యోచిస్తున్నారు.
ఇదీచూడండి: