గ్రామ, వార్డు సచివాలయాల్లో చేరి ఈ ఏడాది అక్టోబరు 2 నాటికి రెండేళ్లు పూర్తయిన ఉద్యోగులు(village and ward secretariats Employees) ప్రొబేషన్(probation) ఖరారు కోసం ఎదురుచూస్తున్నారు. రెండేళ్లుగా నెలకు రూ.15వేల వేతనంతో నెట్టుకొస్తున్న వీరు ప్రొబేషన్ ఖరారైతే వేతనం పెరిగి ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయని ఆశిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబరులో ఉద్యోగుల ప్రొబేషన్ (probation)ప్రక్రియ పూర్తిచేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జిల్లా కలెక్టర్ల(collectors) ను ఆదేశించినా చాలా జిల్లాల్లో ఇంకా మొదలుకాలేదు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులూ ఇదే విషయాన్ని ఇటీవల సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ప్రారంభించిన 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల మంది నియమితులయ్యారు. సర్వీసు నిబంధనల ప్రకారం వీరిలో రెండేళ్లు పూర్తిచేసిన ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారుచేయాలి. శాఖాపరమైన పరీక్షల్లో దాదాపు 80 వేల మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి నియామకాలు కలెక్టర్లు చేపట్టినందున ప్రొబేషన్ ఖరారు చేసే బాధ్యతను ప్రభుత్వం వారికే అప్పగించింది. ఉద్యోగుల సమగ్ర వివరాలను కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే సేకరిస్తున్నారు. గ్రామ సచివాలయాలకు సంబంధించి ఎంపీడీవో, వార్డు సచివాలయాల్లో పుర కమిషనర్లు ఉద్యోగుల సమాచారం పంపాలని కలెక్టర్లు ఆదేశించారు. ఉద్యోగంలో ఎప్పుడు చేరారు, రెండేళ్లలో శిక్షణ పూర్తిచేశారా? శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారా? అభియోగాలు ఎదుర్కొన్నారా? అలాంటివారిపై తీసుకున్న చర్యలేంటి? రెండేళ్లలో తీసుకున్న సాధారణ, ఐచ్ఛిక సెలవులెన్ని? ఇలా దాదాపు 13 అంశాలపై వివరాలు పంపాలని కలెక్టర్లు ఎంపీడీవోలను ఆదేశించారు.
కలెక్టర్లకు నేడు మరోసారి ఆదేశాలు
ప్రొబేషన్(probation) ఖరారు ప్రక్రియ వేగవంతం చేసేలా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇవ్వనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కలెక్టర్లతో సీఎస్ గురువారం వీడియో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి