కరోనా రెండోదశ తాకిడితో పడకలు దొరక్క రోగులు ఒకపక్క ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాలు సహా ద.మ.రైల్వే జోన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన కొవిడ్ కోచ్లు ఖాళీగా ఉన్నాయి. అది కూడా ఏడాదికాలంగా. కరోనా తొలిదశ విజృంభణ సమయంలో రైల్వేశాఖ ముందుకొచ్చి కొన్ని స్లీపర్ బోగీలను కొవిడ్కేర్ కోచ్లుగా మార్చింది. ద.మ.రైల్వే జోన్లో ఇలా 486 బోగీలను అందుబాటులో ఉంచారు. ఒక్కో బోగీలో 8 కూపేలు..కూపేలో ఇద్దరు రోగులకు చొప్పున దాదాపు ఏడున్నరవేల మందికి పైగా చికిత్స పొందవచ్చు.
తెలుగురాష్ట్రాలు సహా జోన్లో భాగమైన మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్ పరిధిలోని ప్రాంతాలవారికి ఇవి ఎంతో ఉపయోగపడేవి. సికింద్రాబాద్లో 120, హైదరాబాద్లో 40, విజయవాడలో 50, గుంతకల్లులో 61, నాందేడ్లో 30, గుంటూరులో 25.. సికింద్రాబాద్, తిరుపతి వర్క్షాప్ల్లో 150 వరకు బోగీలను అందుబాటులో ఉంచారు. అయితే రైల్వే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి ఉన్నా వీటిని ఉపయోగించుకున్న దాఖలాలులేవు. ఇదిలా ఉంటే.. ఇటీవల దాదాపు 70 కొవిడ్ కోచ్లను తిరిగి ప్రయాణికుల బోగీలుగా మార్చినట్లు తెలుస్తోంది.
రైల్వేవర్గాలు ఏమంటున్నాయి?
పలు రాష్ట్రాల్లో దాదాపు మూడొందల కొవిడ్ కోచ్లను వినియోగంలోకి తెచ్చినట్లు రైల్వేవర్గాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అస్సాం, దిల్లీ తదితర రాష్ట్రాల్లో వినియోగించామంటున్నాయి. ద.మ.రైల్వే పరిధిలోనూ సిద్ధంగా ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే ఇస్తామని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.