2015లో ఐ.ఎం.ఎస్ సంచాలకురాలిగా దేవికారాణి బాధ్యతలు స్వీకరించారు. కొద్దినెలల నుంచి గురుమూర్తి భార్య హోదా ద్వారా అక్రమాదాయంపై దృష్టి కేంద్రీకరించాడు. లంచాల రూపంలో లక్షల్లో నగదు తీసుకున్నాడు. వీటిని స్థిర, చరాస్తుల రూపంలోకి మార్చాడు. 2016 నుంచి 2018 వరకూ కేవలం రెండేళ్లలోనే 20 కోట్లకు పైగా ఆస్తులను కూడబెట్టాడు. మార్కెట్ విలువ వందకోట్ల పైమాటే. తను కుటుంబసభ్యుల పేరుతో ఎడాపెడా ఆస్తులు కొనేశాడు.
ఒక్కదెబ్బలో ఐదు కోట్లు కొట్టేశాడు..
వైద్యపరికరాల కొనుగోలు, వైద్య శిబిరాల నిర్వహణ, మందుల సరఫరాలో మోసాల తాలూకూ సొమ్ము ఐదు కోట్ల రూపాయలు ఒకే విడతలో గురుమూర్తికి ముట్టాయి. వీటిని తెల్లధనంగా మార్చుకునేందుకు గురుమూర్తి ప్రణాళిక రచించాడు. వెంటనే కడప జిల్లాలో ఉంటున్న తన తల్లి ఇంటికి వెళ్లాడు. ఆమెతో ప్రేమగా మాట్లాడి తెలివిగా పాన్కార్డును తీసుకొచ్చాడు.
గురుమూర్తి నకిలీలలు
ఆమె ఓ ఆదాయపుపన్ను చెల్లింపుదారు అనే ఆధారపత్రాలు సృష్టించాడు. భూములు విక్రయించగా... తనకు 5 కోట్ల ఆదాయం వచ్చిందని, దీన్ని తన కుమారుడు గురుమూర్తికి రెండున్నర కోట్లు చేబదులుగా, మనవడు యశస్వికి కోటిన్నర బహుమతి ఇస్తున్నట్టు తల్లి అంగీకార పత్రం రాసినట్టుగా పత్రాలు సృష్టించాడు. ఆ సొమ్ముతో ఆదిత్య ఎంప్రెస్లో విల్లా, ప్లాట్లు కొనుగోలు చేశాడు. ఈ మేరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందాడు.
తీగ లాగారు.. డొంక కదిలింది...
అనిశా అధికారులు కడప జిల్లాలో ఉంటున్న గురుమూర్తి తల్లి ఇంటికి వెళ్లారు. మీరు 5 కోట్ల ఆదాయానికి ఆదాయపు పన్ను ఎందుకు కట్టలేదని ప్రశ్నించగా.. ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తాను ప్రభుత్వాధికారిగా పనిచేసి పదవీ విరమణ పొందానని, ప్రస్తుతం తనకు 13 వేలు పింఛన్ మాత్రమే వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నేను 5కోట్లు ఎలా ఇవ్వగలనంటూ అనిశా అధికారులను ప్రశ్నించింది. కొడుకుగా గురుమూర్తి తన బాగోగులు ఎప్పుడూ చూడలేదని, కన్నతల్లినే మోసం చేస్తాడని అనుకోలేదని ఆమె అనిశా అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది .
ఇవీ చూడండి: డొల్ల కంపెనీలతో రూ.3 కోట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు