AP high court on housing scheme: నవరత్నాలు- 'పేదలందరికీ ఇళ్లు పథకం' కింద ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ విచారణ ఈనెల 30కి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ బి.కృష్ణమోహన్తో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్పై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
ఏజీ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం దాఖలు చేసిన 128 మందిలో ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కేటాయించామన్నారు. మరికొందరు అనర్హులన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేస్తే పరిశీలిస్తామన్నారు. అఫిడవిట్ రూపంలో అదనపు వివరాల్ని కోర్టు ముందు ఉంచామన్నారు. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది పిఎస్ఆర్ ఆంజనేయులు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం అందజేసిన వివరాలపై స్పందన తెలిపేందుకు స్వల్ప సమయం కావాలని కోరారు. అర్హులకు స్థలాలు కేటాయించాలన్నదే తమ ఉద్దేశం అన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం(AP High court latest news) విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఆరోజు తుది విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
ఇదీచదవండి.