రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేనాని... అనంతరం మాట్లాడారు. రాజధాని నిర్మాణం అంటే కొన్ని దశాబ్దాలుగా జరిగే ప్రక్రియ అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం 29 గ్రామాల ప్రజల భూములు ఇచ్చారని వివరించారు. అమరావతి రాజధానిని ఏకీభవిస్తున్నామని అసెంబ్లీలో అనాడు జగన్ చెప్పారని పేర్కొన్నారు. ఇవాళ ఎందుకు మాట మార్చారని నిలదీశారు. ఆందోళన చేస్తున్న రైతులకు ప్రతీ ప్రజాప్రతినిధి సమాధానం చెప్పాలని డమాండ్ చేశారు. రాజధాని కంటే ముందు మేం రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడితే ఊరుకోం
అన్ని జిల్లాల ప్రజలు ఎన్నుకుంటే జగన్ సీఎం అయ్యారని పవన్ పేర్కొన్నారు. కొన్ని జిల్లాల కోసమే ముఖ్యమంత్రిగా పని చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించారు. ప్రాంతీయ విభేధాలు రెచ్చగొట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అమరావతిలో అవినీతి జరిగితే చట్టాలు ఉన్నాయని... విచారణ జరిపించి శిక్షించాలని సూచించారు. నాయకులపై కోపం ప్రజలపై చూపించొద్దని హితవుపలికారు. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం జరిగేవరకు జనసేన అండగా ఉంటుందన్న పవన్...పెయిడ్ ఆర్టిస్టులు, ఎడారి వంటి పదాలు ఉపయోగించడం క్షమించారని విషయమని ఉద్ఘాటించారు.
అడ్డుకోవడంపై పవన్ ఆగ్రహం
రాజధాని రైతుల కన్నీరు తుడవడానికి, వాళ్ల గోడు వినడానికి వస్తున్న తనను పోలీసులు ముళ్లకంచెలు పెట్టి మరీ అడ్డుకోవడంపై... జనసేన అధినేత పవన్కల్యాణ్ ఆగ్రహించారు. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ... కాలినడకనే మందడంలో ధర్నా జరుగుతున్న చోటుకు చేరుకున్నారు. రాజధాని ప్రాంత రైతులకు జనసేన అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు.
ఉత్తరాంధ్రపై ప్రేమ పుట్టుకోచ్చిందా..?
తుళ్లూరు రైతుల మహాధర్నాకు సంఘీభావం ప్రకటించిన పవన్ ఈ సందర్భంగా ప్రసగించారు. మహిళలు రోడ్డ మీదకు రావడం చూసే తాను అమరావతికి వచ్చానని చెప్పారు. ఒక్క అవకాశం అడిగారని అధికారం ఇస్తే... ఇప్పుడ మనల్ని ఇంట్లో నుంచి గెంటేశారని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు ఇక నుంచి జై ఆంధ్రా, జైజై ఆంధ్రా నినాదాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ నినాదంతో ముందుకెళ్తే... ఎవరు అడ్డం వస్తారో చూస్తా అని పవన్ ఆగ్రహంగా మాట్లాడారు. ఉత్తరాంధ్రపై ప్రేమగా మాట్లాడుతున్న వైకాపా నేతలు... హుద్హుద్ తుపాన్ వచ్చినప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తిత్లీ తుపాన్ బాధితులను సీఎం జగన్ కనీసం పరామర్శించలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజల వలసలు ఇవాళ గుర్తుకొచ్చాయా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర భూములు పెద్దవారి చేతుల్లోకి వెళ్లాయని ఆరోపించారు. రైతులను అర్ధరాత్రి అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లపై మీలాగా 11 కేసులున్నాయా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ఇదిగో... నువ్ మాత్రం జాగ్రత్త సుమీ..!