Tribes: రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 11 లక్షల మంది, మైదాన ప్రాంతాల్లో 21 లక్షల మంది గిరిజనులు ఉంటే ఏజెన్సీ ప్రాంతానికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ సీట్లు, నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తున్నారని, మైదాన ప్రాంతానికి అనాదిగా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆ ప్రాంత గిరిజన సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రి, గిరిజన సహకార సంస్థ అధ్యక్షుడు అన్ని పదవులనూ ఆ ప్రాంతానికే పరిమితం చేస్తున్నారని వాపోయారు.
జనాభా దామాషా ప్రకారం మైదాన ప్రాంతానికీ కేటాయింపులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తమ సత్తా చాటేలా విజయవాడ కేంద్రంగా అన్ని సంఘాలతో కలిసి భారీ బహిరంగ సభగానీ, ర్యాలీగానీ నిర్వహించేందుకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడలో మైదాన ప్రాంత గిరిజన సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.
ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు, 50 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. బస్సు యాత్ర నిర్వహిస్తే మేలని రాష్ట్ర యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్టీలకు అన్యాయం జరగకుండా చర్చ జరిగేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దృష్టికి తీసుకెళ్లి, ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణ చేపట్టేలా సంఘాలు ప్రయత్నించాలని పెంచలయ్య సూచించారు.
అసెంబ్లీలో తీర్మానం చేసేలా ఒత్తిడి తేవాలని గిరిజన సంఘాల ఐకాస అధ్యక్షుడు రవి, ఎస్టీ ఉద్యోగ సంఘం నేత రాంబాబు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు తమ ప్రాంతాల్లోని ప్రజల ఇబ్బందులపైనే మాట్లాడలేని పరిస్థితి ఉందని బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు పరంజ్యోతి పేర్కొన్నారు. శ్రీశైలం, అహోబిలం, తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీల్లో గిరిజనులకు ఒక్కరికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానం కల్పించిందా? అని యానాదుల సంక్షేమ సంఘం మహిళా నాయకురాలు సరస్వతి ప్రశ్నించారు.
గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేవు.. ‘రాష్ట్రంలోని చాలా గిరిజన ప్రాంతాల్లో సరైన రహదారులు లేవు. శ్రీశైలం అడవుల్లో, మార్కాపురం, చిత్తూరు జిల్లాలోని గిరిజనుల పరిస్థితి కడు దయనీయంగా ఉంది. గిరిజనులకు విద్య, ఆరోగ్య, ఉపాధి అవకాశాలు దక్కాలంటే సంపూర్ణ చైతన్యంతోనే సాధ్యపడుతుంది. ఐక్యతతోనే పరిస్థితిలో మార్పు వస్తుంది. విజయవాడ కేంద్రంగా సమైక్యత చాటాలి..’ అని ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రాథమిక పాఠశాలలను ముక్కలు చేయొద్దు: విద్యాపరిరక్షణ కమిటీ