తెలంగాణలోని భైంసా ఘటనలో ఐపీఎస్ అధికారులను తప్పుపడుతూ భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం శోచనీయమని పేర్కొంది. పోలీసులు, ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి.. సంజయ్ మాట్లాడిన తీరు, చేసిన ఆరోపణలు దురదృష్టకరమని అధికారుల సంఘం పేర్కొంది. పోలీసు అధికారులు చట్టానికి లోబడి తమ విధులు నిర్వర్తిస్తారని స్పష్టం చేసింది.
మతపరమైన అల్లర్లు జరిగినప్పుడు సకాలంలో పరిస్థితిని అదుపులోకి తీసుకురాకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని.. ఒక్కోసారి ప్రజల భద్రతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు చేపట్టినట్టు ఐపీఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. చట్టానికి లోబడి నిష్పాక్షిపాతంగా చర్యలు తీసుకున్నట్టు వివరించారు. పోలీసు సిబ్బంది, అధికారులు అంకిత భావంతో.. నిత్యం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు.
ఇవీ చూడండి:
లైవ్ అప్డేట్స్: కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం