అమెరికాలోని డల్లాస్లో ఓ కారు వేగంగా వచ్చి మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. హైదరాబాద్కు చెందిన రాజా, దివ్య దంపతులు అమెరికాలో స్థిర పడ్డారు. అక్కడే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వారి అన్యోన్యతకు గుర్తుగా ఏడేళ్ల కూతురు ఉంది. సంతోషంగా సాగిపోతున్న జీవితంలో సొంతింటి కల అలానే మిగిలిపోయిందనే బాధ ఉండేది. అందుకే ఇటీవలే ఓ ఇంటిని నిర్మించుకున్నారు.
కొత్త ఇంటిని చూసేందుకు దంపతులిద్దరూ బయలుదేరారు. రాజా మిత్రుడు ప్రేమ్నాథ్ను సైతం తీసుకెళ్లారు. వాళ్ల గారాల పట్టి రియాను డాన్స్ స్కూల్లో దింపేశారు. మళ్లీ వస్తామని చెప్పారు. కొద్దిసేపటికే ఎదురుగా ఓ బాలుడు వేగంగా వచ్చి వారి కారును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.
దంపతులిద్దరిదీ హైదరాబాద్లోని గాంధీనగర్. ప్రేమ్నాథ్ది ఆంధ్రప్రదేశ్. రాజా బంధువు రాఘవరావు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఒకేసారి అమ్మానాన్న చనిపోవడం వల్ల ఏడేళ్ల చిన్నారి అనాథగా మారింది.
ఇదీ చూడండి:
పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం... మహిళ మృతి, 20 మందికి గాయాలు