రాజధాని ప్రాంతంలో రైతుల మరణాలపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారని... అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు తెలిపారు. దిల్లీలో దేశ ప్రథమ పౌరుడిని కలిసిన వారు... 3 రాజధానుల ప్రతిపాదనతో నెలకొన్న సంక్షోభం, భూములు త్యాగం చేసిన రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వివరించారు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి అండగా నిలవాలని కోరారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను ఇవాళ కలిసే అవకాశం ఉందని ఐకాస నేతలు తెలిపారు.
అమరావతిలో రైతుల ఆందోళనలు 53వ రోజూ ఉద్ధృతంగా కొనసాగాయి. రాయపూడిలో మహిళలు జలదీక్షలు చేసి పొంగళ్లు సమర్పించారు. తుళ్లూరు, రాయపూడి దీక్షా శిబిరాల్లో ముస్లింలు మత ప్రార్థనలు నిర్వహించారు. శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ రైతుల పక్షాన నిలబడ్డారంటూ ముస్లిం పెద్దలకు రాయపుడిలో సన్మానం చేశారు. వెలగపూడిలో ఇద్దరు యువకులు 151 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. మహిళలు మందడం నుంచి భారీ ర్యాలీగా వెలగపూడి చేరుకుని రైతులకు సంఘీభావం తెలిపారు. అమరావతి విద్యార్థి ఐకాస ఉద్యమ కార్యాచరణకు సంబంధించి గోడ ప్రతులు విడుదల చేసింది.