ఆంధ్రప్రదేశ్ చేపట్టిన కొత్త నీటి పథకానికి సంబంధించి చర్చించేందుకు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సూచించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సాంకేతికంగా పరిశీలించాలని.. అప్పటివరకు ముందుకు వెళ్లకుండా ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీని కోరాలని చెప్పామని తెలంగాణ భాజపా అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కు రాసిన లేఖలో మంత్రి పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జల్శక్తి మంత్రిత్వశాఖ అధికారులను ఆదేశించినట్లు వివరించారు.
శ్రీశైలం నుంచి రోజూ మూడు టీఎంసీల నీటిని మళ్లించేలా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని తీసుకోవడం కోసం శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా పనులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోందని, కృష్ణా బేసిన్లో తెలంగాణ హక్కులు కాపాడటానికి చర్యలు తీసుకోవాలంటూ బండి సంజయ్ కేంద్ర జల్శక్తి మంత్రికి లేఖ రాశారు. దీనిపై మంత్రి బోర్డు నుంచి వివరాలు కోరారు. ఈ అంశాన్ని తమ మంత్రిత్వశాఖ పరిశీలించిందని, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనల ఆధారంగా ప్రాజెక్టుల డీపీఆర్లను పరిశీలించాలని కృష్ణా బోర్డును సూచించినట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: