AP rank in innovation: నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇన్నోవేషన్ ఇండెక్స్లో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ రెండో ర్యాంకును సాధించింది. ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానానికి పరిమితమైతే.. కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. గురువారం ఉదయం ఇక్కడి నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు సుమన్ బేరి, సీఈఓ పరమేశ్వరన్, సభ్యుడు వీకే సారస్వత్ నివేదికను విడుదల చేశారు. ర్యాంకుల్లో క్రితంసారి నాలుగో స్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి రెండో స్థానం చేజిక్కించుకుంది.
ఆంధ్రప్రదేశ్ 7 నుంచి 9వ స్థానానికి పడిపోయింది. 17 పెద్ద రాష్ట్రాలు, 10 ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాల పనితీరును వేర్వేరుగా పరిశోధించి నివేదికను విడుదల చేసినట్లు నీతి ఆయోగ్ పేర్కొంది. ర్యాంకుల కోసం తీసుకున్న కొలమానాలను ‘ఎనేబులర్స్’, ‘పెర్ఫార్మర్స్’ పేరుతో రెండు గ్రూపులుగా విభజించారు. వాటిలో ‘ఎనేబులర్స్’ విభాగంలో తెలంగాణ నాలుగో స్థానం, ఏపీ 8వ స్థానం సాధించాయి. పెర్ఫార్మర్స్ విభాగంలో తెలంగాణ తొలి స్థానం పొందగా.. ఆంధ్రప్రదేశ్ 14తో సరిపెట్టుకుంది. ‘తెలంగాణ పెద్ద బహుళజాతి సంస్థలు, స్టార్టప్లకు నెలవుగా మారింది. రాష్ట్రం అన్ని కొలమానాల్లోనూ మంచి పనితీరు కనబరిచింది.
ఉన్నత విద్యలో ఎన్రోల్మెంట్స్ (ప్రతి లక్ష జనాభాకు) 9.7 నుంచి 15.7కి పెరిగాయి. నాలెడ్జ్ వర్కర్స్ తయారు చేయడంలో రాష్ట్రానికున్న సత్తాకు ఇది అద్దం పడుతోంది. దీనికితోడు పేటెంట్లు, ట్రేడ్ మార్కులు, ఇండస్ట్రియల్ డిజైన్లాంటి అంశాల్లోనూ రాష్ట్రం సత్తాను చాటుకుంది. స్టార్టప్స్ సంఖ్య 4,900 నుంచి 9వేలకు చేరాయి. అయితే విజ్ఞాన వ్యాప్తిలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మెరుగు పరుచుకోలేకపోయింది. ఆ ప్రభావం ఉత్పత్తులు, సేవల్లో చూపింది. అందువల్ల కేవలం జ్ఞానాన్ని సముపార్జించడంపై దృష్టి పెట్టడమే కాకుండా దాన్ని ఉత్పత్తులు, సేవల్లోకి మార్చుకోవాలి’ అని నీతి ఆయోగ్ సూచించింది.
ఇవీ చదవండి: