ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో రెవెన్యూ వసూళ్లు... అంచనాలను చేరుకోవడం కష్టమేనని అనిపిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు తాజాగా రూపొందించిన గణాంకాలు పరిశీలిస్తే ఇది నిజమేనని అనిపిస్తోంది. 2019 -20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూపొందించుకున్న లెక్కలతో పోలిస్తే... దాదాపు 21 వేల కోట్లు తక్కువ ఆదాయం వస్తుందని తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ 14 వరకు రాష్ట్రానికి వివిధ రూపాల్లో 98 వేల 458 కోట్లు రెవెన్యూ ఆదాయం వచ్చినట్లు అధికారులు లెక్కించారు. నవంబర్ 14 తర్వాత నుంచి ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే ...మార్చి 31 నాటికి 59 వేల 348 కోట్ల ఆదాయం రావచ్చని అంచనాలు రూపొందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లక్షా 57 వేల 806 కోట్ల ఆదాయం సాధ్యమని చెబుతున్నారు. నిజానికి తొలి రోజుల్లో లక్షా 78 వేల కోట్లు రెవెన్యూ సముపార్జించగలమని అంచనా వేశారు. ఇప్పుడు ఆస్థాయికి చేరడం అంత సులభం కాదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే 3 శాతం రెవెన్యూ ఆదాయాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో నవంబరు 14 వరకూ వచ్చిన వసూళ్లు.. రాబోయే ఆదాయంపై అంచనాలు ఇలా ఉన్నాయి.
అంశం | వచ్చిన ఆదాయం(అంకెలన్నీ కోట్లలో) | రాబోయే రోజుల్లో వస్తుందన్న అంచనా(అంకెలన్నీ కోట్లలో) |
రాష్ట్ర సొంత ఆదాయం | 35,130 | 22,253 |
కేంద్ర పన్నుల్లో వాటాలు | 15,795 | 19,061 |
కేంద్ర గ్రాంట్లు | 3,326 | 4,559 |
కేంద్ర ప్రాయోజిత పథకాలు | 6,652 | 4,244 |
ఇచ్చిన రుణాలు వసూళ్లు | 43 | 28 |
రుణాలు రూపేణా | 29,432 | 10,447 |
ప్రజాపద్దు | 8,071 | -1,244 |
మొత్తం ఆదాయం | 98,458 | 59,348 |
ఇదీ చూడండి: