ఏమీ తెలియని ఓ అమాయక కూలీ దారుణ హత్యకు గురైన ఘటన హైదరాబాద్ హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కర్నూల్కు చెందిన దొడ్డ మధుసూదన్ రెడ్డి(45) గత కొన్నేళ్లుగా నగరంలోనే పెయింటర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హయత్నగర్లో ఉన్న సుభాష్ అనే ఓ ఫ్రూట్స్ వ్యాపారి వద్ద గత నెల రోజుల క్రితం పనికి చేరాడు. గురువారం రాత్రి మధుసూదన్ రెడ్డితో పాటు అక్కడే పని చేస్తున్న ఆనంద్, నర్సింహ్మ అనే ఇద్దరు రాత్రి పడుకొని ఉన్నారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆ ఫ్రూట్ షాప్ యజమాని ఓ బైక్ను తెచ్చిచ్చి.. రూ.720 ఇస్తేనే ఈ వెహికల్ ఇవ్వమని చెప్పాడు. అక్కడే ఆ వెహికల్ పెట్టుకున్న కూలీల వద్దకు ముగ్గురు వచ్చి.. విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేశారు. నర్సింహ్మకు తీవ్ర గాయాలు కాగా... మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ హత్య 720 రూపాయల వివాదంలోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఫ్రూట్ షాపు యజమాని సుభాష్.. మద్యం సేవించడానికి ఓ వైన్షాపు దగ్గరికి వెళ్లాడు. అక్కడే సుభాష్కు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ యువకుడు తనకు రూ.720 కావాలని ఏటిఎం దగ్గర ఇస్తానని చెప్పగా.. సుభాష్ డబ్బులు ఇచ్చాడు. మద్యం సేవించిన తర్వాత ఆ యువకుడు డబ్బులు ఇవ్వకపోవటం వల్ల.. సుభాష్ ఆ యువకుడి బైక్ తీసుకువచ్చి తన షాపు వద్ద నిద్రిస్తున్న మధుసూదన్ రెడ్డి, ఆనంద్, నర్సింహాకు అప్పగించాడు. ఓ యువకుడు వచ్చి డబ్బులు ఇచ్చి బైక్ తీసుకెళుతాడని చెప్పాడు. యజమాని మాట విన్న వాళ్లు.. ఆ బైక్ అక్కడే పెట్టుకొని నిద్రిస్తున్నారు.
కొద్దిసేపటి తర్వాత మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ ఫ్రూట్ షాపుకు చేరుకున్న బైక్ యువకుడు... అక్కడే నిద్రిస్తున్న మధుసూదన్ రెడ్డి, ఆనంద్, నర్సింహాతో గొడవపడి దాడి చేశారు. ఈ ఘటనలో మధుసూదన్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. నర్సింహాకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదీ చూడండి: బడ్జెట్: మూడు నెలలకు రూ. 86 వేల కోట్లు !