హైదరాబాద్ హయత్నగర్కు చెందిన బాధితుడికి గుర్తుతెలియని వ్యక్తుల దగ్గరి నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది. ఇన్స్టా గ్లోబల్ ప్లే ట్రేడింగ్ వెబ్సైట్ నుంచి మాట్లాడుతున్నామంటూ అవతలి వైపు వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. రాబోయే రోజుల్లో అమెరికా డాలర్ ధర మరింత పెరగుతుందంటూ వివరించారు. తక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు కొనుగోలు చేసి పెట్టుకుని అప్పుడు అమ్మితే భారీగా లాభాలొస్తాయంటూ నమ్మించాడు.
నమ్మించేందుకు 100 డాలర్లు బదిలీ...
బాధితుడి నుంచి వివరాలను సేకరించి మెంబర్షిప్ తెరిచారు. బాధితుడిని నమ్మించేందుకు అతని ఖాతా (మెంబర్ షిప్)లోకి 100 అమెరికా డాలర్లను బదిలీ చేశాడు. వెబ్సైట్లో లాగిన్ అయ్యి... ఆ మొత్తం వచ్చాయో లేదో చూసుకోమని చెప్పాడు. బాధితుడు నిజమేనని నిర్ధారించుకుని రూ.3వేలు కమిషన్గా చెల్లించాడు. దీంతో అతను తమను నమ్మినట్లుగా నిందితులు భావించారు.
50వేల అమెరికన్ డాలర్లు వచ్చాయంటూ...
గతేడాది జూన్ 26న అతనికి పరిచయమున్న మరో నిందితుడి(దేవరాజ్రెడ్డి)తో ఫోన్ చేయించారు. బిట్కాయిన్లో పెట్టుబడులు పెడితే 50వేల అమెరికన్ డాలర్లు అధికంగా వచ్చాయంటూ నమ్మించాడు. 40 శాతం అంటే... రూ.16 లక్షలు కమిషన్గా చెల్లిస్తే ‘ఇన్స్టా గ్లోబల్ ప్లే వ్యాలెట్’ ఖాతాకు బదిలీ చేస్తామంటూ ఆఫర్ ఇచ్చాడు. ముందు బదిలీ చేయి... ఆ తర్వాత కమీషన్ ఇస్తానంటూ బాధితుడు షరతూ విధించాడు. అప్పటికప్పుడు సదరు కేటుగాళ్లు నకిలీ ఖాతాను సృష్టించారు. అందులో 50వేల అమెరికన్ డాలర్లు బ్యాలెన్స్ ఉన్నట్లు స్క్రీన్ షాట్స్ పంపించారు.
రూ.16 లక్షలు బదిలీ...
బాధితుడి దగ్గర ఆ ఖాతాకు సంబంధించిన ఐడీ, పాస్వర్డ్ లేకపోవడంతో నిజమో... కాదో నిర్ధారించుకోకుండానే రూ.16 లక్షలు బదిలీ చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ 50 వేల అమెరికన్ డాలర్లను విత్డ్రా చేసుకునేందుకు యత్నించి విఫలమయ్యాడు. అది వర్చువల్ మనీ అని అప్పుడు తెలుసుకుని కేటుగాళ్లను సంప్రదించగా అటు నుంచి స్పందన రాలేదు.
సాంకేతిక ఆధారాలతో...
వెంటనే బాధితుడు రాచకొండ సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు కేపీహెచ్బీకి చెందిన పి.వంశీధర్రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి రెండు ఫోన్లు, వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న దేవరాజ్రెడ్డి, ఎండీ సుభాణ్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: