Ministers on GO 317 : జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి, వారి వివరాలు వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. సచివాలయంలో జీవో 317 మంత్రివర్గ ఉపసంఘం ఛైర్మన్ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. శుక్రవారం మరికొన్ని శాఖలు నివేదికలు సమర్పించగా, మరిన్ని విభాగాల నుంచి పూర్తి వివరాలు అందలేదని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది.
వెబ్సైట్ ద్వారా అందిన దరఖాస్తుల్లో సుమారు 30 నుంచి 40 శాతం పునరావృతమైనట్లు కమిటీ గుర్తించింది. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను ఉపయోగించుకొని కొందరు సొంత జిల్లాలకు వెళ్లేందుకు తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు కమిటీ దృష్టికి తెచ్చారు. నష్టపోయిన వారి వివరాలు మాత్రమే గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది.