Microlink Networks Investment in Hyderabad : అమెరికా టెలికమ్యూనికేషన్ల సంస్థ మైక్రోలింక్ నెట్వర్క్స్ 500 కోట్ల రూపాయల పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రంలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్కు చెందిన పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్ను ప్రారంభించనుంది.
గురువారం సచివాలయంలో ఆ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో మైక్రోలింక్, పీఎస్ఆర్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. వచ్చే మూడేళ్లలో 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఎలక్ట్రానిక్, ఐటీ, నిర్మాణరంగ పరికరాలను ఉత్పత్తి చేస్తుందని శ్రీధర్ బాబు వివరించారు. మూడేళ్లలో 700 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇటీవల తన అమెరికా పర్యటనలో మైక్రోలింక్ నెట్ వర్క్స్ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని మంత్రి అన్నారు.