By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 10:56 AM IST
ప్రజలు నన్ను కోరుకుంటున్నారు: కేఏ పాల్
Praja Shanthi Party KA Paul Comments: ప్రజాశాంతి పార్టీకి 54 శాతం ఓటు బ్యాంకు ఉందని అన్ని ఛానల్స్ సర్వే నివేదికలు వేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఎంతోమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ప్రజాశాంతి పార్టీలో చేరారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒత్తిడి ఉన్నా వాళ్లంతా ప్రజాశాంతి పార్టీలో చేరారని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర అప్పులు అన్నీ ఒక్క సమావేశంతో తీర్చేస్తాననే నమ్మకం వాళ్లందరికీ ఉందని తెలిపారు. అందుకే గొప్ప గొప్ప వ్యక్తులు తమ పార్టీలోకి వస్తున్నారని చెప్పారు.
ఇప్పటికే ఛారిటీ కింద ఐదు లక్షల కోట్ల రూపాయలు పంచినట్లు తెలిపారు. సొంత చార్టెడ్ ఫ్లైట్స్లో తిరిగిన తాను ఇప్పుడు ప్రపంచాన్ని వదలిపెట్టి పల్లెల్లో తిరుగుతున్నానన్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో తాను తిరగడం ప్రపంచంలోనే ఎనిమిదో వింతని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తనను, ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారని చెప్పారు. తాను ఎంత గొప్పవాడినో ప్రధాని మోదీకి కూడా అర్థం అయ్యిందని, అందుకే తనను వాడుకుంటున్నారని పేర్కొన్నారు. అదే విధంగా తాను శపించడం వల్లే కేసీఆర్, కేటీఆర్ ఓడిపోయారని, తన దీవెనల వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని కేఏ పాల్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు తీర్చేద్దామని రేవంత్ రెడ్డికి చెప్పానన్నారు.