ఘనంగా మత్స్యకారుల కులదైవం నూకతాత సంబరాలు! - Nukatatha celebrations
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 10, 2024, 5:06 PM IST
Nukatatha Celebrations Anakapalli District : అనకాపల్లి జిల్లాలో మత్స్యకారుల కులదైవమైన నూకతాత సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జిల్లాలోని నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏటా మహాశివరాత్రి అమావాస్యని పురస్కరించుకుని ఈ సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా మెుదటగా నూకతాత ప్రతిమలకు బోయపాడు సముద్ర తీరంలో పుణ్యస్నానాలు చేయించారు. అనంతరం పూజారులు ఆ ప్రతిమలను తీసుకుని రాజయ్యపేట గుడికి కాలినడకన బయలుదేరడం ఈ వేడుకలో ప్రధాన ఘట్టం. ముందుగా పూజారులు వస్తుండగా, భక్తులు దారి పొడవున పరదాలు పరిచి వాటిపై పడుకుని ఉంటారు. అనంతరం నూకతాత ప్రతిమలతో పూజారులు వారి పైనుంచి నడుచుకుంటూ వెళ్లాటం సాంప్రదాయంగా వస్తుంది. ఇలా చేస్తే తమ పాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.
ఈ వేడుకను తిలకించడానికి వచ్చిన భక్తులతో రాజయ్యపేట గ్రామం జనసంద్రాన్ని తలపించింది. వేలాది మంది భక్తులు తరలిరావడంతో గ్రామం కిక్కిరిసిపోయింది. నూకతాత వద్ద ఆశీర్వాదం పొందేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఆయన ప్రతిమపై భక్తులు శనగపప్పులు వెదజల్లి భక్తిని చాటుకున్నారు. ఈ వేడుకల్లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఈ ఉత్సవాలను టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత దర్శించుకున్నారు.