రాజ్నాథ్సింగ్తో కాపు రామచంద్రారెడ్డి భేటీ - బీజేపీలో చేరేనా ! - రాజ్నాథ్ను కలిసిన రామచంద్రారెడ్డి
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 27, 2024, 8:25 PM IST
MLA Kapu Ramachandra Reddy meet With Rajnath Singh: రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బీజేపీ అగ్రనేతలతో భేటీ కావడం ప్రస్తుత రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. విజయవాడలో ఐదు లోక్సభ నియోజకవర్గాల కోర్కమిటీ సమావేశాన్ని బీజేపీ నిర్వహించింది. ఈ సమావేశానికి వచ్చిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్తో రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. కొద్దిసేపు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో చర్చించారు. తాను మర్యాద పూర్వకంగానే రాజ్నాథ్ సింగ్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తమ జిల్లాకు సంబంధం లేని సమావేశం జరుగుతున్నందునే సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశానని రామచంద్రారెడ్డి తెలిపారు.
భవిష్యత్తు రాజకీయాలపై ఇంకా తగిన నిర్ణయం తీసుకోలేదన్నారు. వైఎస్సార్సీపీకి తాను దూరంగానే ఉన్నానని చెప్పారు. మంగళగిరిలో వైసీపీ నిర్వహించిన సమావేశానికి తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిల మార్పు వ్యవహారంలో రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఇప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని రామచంద్రారెడ్డి అన్నారు. బెజవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకున్నట్లు వెల్లడించారు.