Telangana High Court on Temples Management : ఆలయాలు వ్యాపార కేంద్రాలు కాదని, ఆదాయం పెంచుకోవడానికి వ్యాపార దృక్పథంతో పని చేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆలయ నిర్వహణకు ఖర్చులు ఎక్కువయినట్లయితే లోటును ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. భక్తులు ఇచ్చే విరాళాలు, కానుకలతో ఆలయాలను నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోందని పేర్కొంది.
విరాళాల ద్వారా ఆదాయం పెంచుకోవడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలతో ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో కొవిడ్ కారణంగా వ్యాపారులు కోల్పోయిన లైసెన్సు కాలాన్ని 5 నెలలపాటు పొడిగించాలంటూ తీర్పు వెలువరించింది. 202 రోజుల లైసెన్సు కాలాన్ని పాడిగించాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండా చీరలు, జాకెట్ ముక్కలు, కొబ్బరి చిప్పల సేకరణ నిమిత్తం మహంకాళి ఆలయం కార్యనిర్వహణాధికారి గత ఏడాది మార్చి 3న జారీ చేసిన టెండరు నోటిపికేషన్ను సవాలు చేస్తూ ఎన్ నవీకుమార్, మరొకరు హైకోర్టులో వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్.వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ "2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చి 31 వరకు హక్కులు పిటిషనర్లకు ఉన్నాయి. అయితే కొవిడ్ కారణంగా దుకాణాలను మూసివేయడంతో 202 రోజులు పొడిగిస్తూ 2021 డిసెంబరు 17న ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీన్ని అమలు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి విరుద్ధంగా ఈవో టెండరు నోటిఫికేషన్ జారీ చేశారు." అని కోర్టుకు తెలిపారు.
మరోవైపు దేవాదాయశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ "పిటిషనర్లకు ఇచ్చిన గడువు కంటే అదనంగా కొనసాగించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 దాకా లైసెన్సు పొడిగించాం. మళ్లీ పొడిగించాలని కోరే హక్కు లేదు. 2020 జూన్ నుంచి అక్టోబరు 30 దాకా ఆలయం తెరిచే ఉంది. టిక్కెట్ల విక్రయానికి సంబంధించిన మెమోను పరిశీలించండి. దీనికి సంబంధించి రూ.32 లక్షలు పిటిషనర్లు చెల్లించిన పక్షంలో కొనసాగించడానికి అభ్యంతరం లేదు." అని వాదించారు.
ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఆదాయం పెంచుకోవడానికి అధికారులు అనుసరిస్తున్న చర్యల కారణంగా ఆలయాలు వ్యాపార కేంద్రాలుగా తయారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయాన్ని మించి ఖర్చులున్నపుడు ఆ లోటును ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉందని తెలిపారు. ఇక్కడ కొవిడ్ కారణంగా దుకాణాలను మూసివేశారని, 2020లో ఆలయాలు తెరిచినట్లు దేవాలయ అధికారులు సమర్పించిన మెమోల్లో అధికారిక సంతకం లేదని వెల్లడించారు. అందువల్ల దాన్ని ఆధారంగా అంగీకరించలేమని పేర్కొన్నారు. లైసెన్సును ఎంత కాలం పొడిగించాలనే లెక్కలపై భిన్న వాదనలున్నాయని, వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 5 నెలలపాటు పిటిషనర్ల లైసెన్సును పొండిగించాలని ఈవోను అదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేశారు.