Telangana Govt Conduct International Anti-Drug Day Program : ప్రస్తుత కాలంలో డ్రగ్స్ మహమ్మారి తెలంగాణతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్ప కళావేదికలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమెతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు, డీజీపీ రవిగుప్తా, టీజీన్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, హీరో తేజ సజ్జ, సుమన్, మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్, సీనియర్ ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మాదకద్రవ్యాల బారిన పడి ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్కు అలవాటు పడితే సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి ఎదురవుతుందని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మాఫియా కోట్లు సంపాదిస్తుందని చెప్పారు. డ్రగ్స్ మత్తులో బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు.
మానవుడిగా పుట్టడం గొప్ప అదృష్టం : అన్నింటికంటే మానవుడిగా పుట్టడం అదృష్టమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. జీవితంలో ఉన్నత స్థానాలకు రావాలని కలలు కనాలని, వాటిని నిజం చేసుకోవాలని చెప్పారు. కానీ కొందరు డ్రగ్స్ మహమ్మారి ఊబిలో చిక్కుకుంటున్నారని ఆందోళన చెందారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా, సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అవగాహన కల్పిస్తున్న ఓ వీడియోను విడుదల చేశారు. గతంలో నార్కొటిక్ ఎస్పీగా పని చేసిన ఎగ్గడి భాస్కర్ రాసిన గీతాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేశారు.