AP High Court Abolished Common Elementary Exam: ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న ఎలిమెంటరీ విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహణను హైకోర్టు తప్పుబట్టింది. ఎలిమెంటరీ విద్య చదువుతున్న రాష్ట్రంలోని విద్యార్థులకు ఏకరూప ప్రశ్నాపత్రంతో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29కి(Curriculum and Evaluation Procedure) విరుద్ధమని తేల్చిచెప్పింది. ఉమ్మడి పరీక్ష రాసేందుకు వీలుగా 2022లో తీసుకొచ్చిన విధానం విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని పేర్కొంది. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలను నిర్ధిష్ట సమయంలో అభిప్రాయాలను చెప్పాలని ఒత్తిడి చేయడమే అవుతుందని, అంతేకాక వారిని బాధ, భయాందోళనకు గురిచేసినట్లుందని అభిప్రాయపడింది.
తరగతిగది ఆధారిత మదింపు(Classroom Based Assessments) ద్వారా ఒకటి నుంచి ఎనిమిదో తరగతుల పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఉమ్మడి పరీక్ష కోసం ఉద్దేశించిన షెడ్యూల్, టైం టేబుల్ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ఇటీవల ఈమేరకు తీర్పు ఇచ్చారు. సపోర్టింగ్ ది ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రోగ్రాం(సాల్ట్) కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ అన్ఎయిడెడ్ విద్యా సంస్థలు తప్పనిసరిగా ఉమ్మడి పరీక్ష ప్రక్రియలో పాల్గొనాలని, అందుకోసం రుసుములు చెల్లించాలని పేర్కొంటూ రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి (State Council of Educational Research and Training) డైరెక్టర్ 2022 అక్టోబర్లో ఉత్తర్వులు జారీచేశారు.
బైకర్స్ అలర్ట్ - ఇకపై హెల్మెట్ మస్ట్ - హైకోర్టు ఆదేశం - Helmet Must For 2 Wheeler Riders
"సాల్ట్" కార్యక్రమం వర్తింపచేయడం ద్వారా తమకు ఉమ్మడి పరీక్షను నిర్వహించడాన్ని సవాలుచేస్తూ ‘యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్’ ఛైర్మన్, మరొక విద్యా సంస్థ కార్యదర్శి 2022లో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. "సాల్ట్" కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలను ఉద్దేశించిందన్నారు. ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహణ విద్యా హక్కు చట్ట నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహణను తప్పుపట్టారు.
సాల్ట్ కార్యక్రమం పరిధిలోకి ప్రైవేటు పాఠశాలలు రావన్నారు. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 30 ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తయ్యేంత వరకు ఏ విద్యార్థి కూడా ‘బోర్డు పరీక్ష’లో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం లేదని గుర్తుచేశారు. తరగతిగది ఆధారిత మదింపు(సీబీఏ) విధానం బోర్డు పరీక్ష కానప్పటికీ, టైం టేబుల్ నిర్ణయించడం, ఏకరూప ప్రశ్నాపత్రంతో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం ‘బోర్డు పరీక్ష’ను పోలి ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎలిమెంటరీ పాఠశాలల చిన్నారులకు ఈ విధానం బాధ కలిగించేదిగా, భయపెట్టేదిగా ఉంటుందని స్పష్టంచేశారు.
'వాలంటీర్ల రాజీనామా'- కౌంటర్ దాఖలుపై హైకోర్టు ఆదేశాలు - HC on Volunteers Resign Petition