Kishan Reddy: అక్కడ ఆసుపత్రి నిర్మాణానికి భూమిని కేటాయిస్తే... నిధులు తీసుకురావడానికి సిద్ధం - Union Minister Kishan Reddy
Kishan Reddy in Manikeshwar Nagar, Hyderabad: హైదరాబాద్ మణికేశ్వర్ నగర్ బస్తీలో ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం.. ముందుకు వస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆస్పత్రి నిర్మాణం కోసం మణికేశ్వర్ నగర్ కమాన్ వద్ద అఖిలపక్షం నాయకులు గత కొన్ని రోజులుగా చేస్తున్న దీక్షకు మంత్రి సంఘీభావం పలికారు.
పెట్రోల్ బంకులు, మసీదులు, పెద్ద హోటల్ నిర్మాణాలకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి ఇచ్చిందని.. ఇక్కడ ఉండే విద్యార్థులకు, ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని ఎందుకు కేటాయించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తక్షణమే ఆసుపత్రి నిర్మాణానికి భూమిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై తాను ఉస్మానియా యూనివర్సిటీ వీసీ, ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆలకుంట హరి, మాజీ మేయర్ బండ కార్తిక రెడ్డి, ఆదం విజయకుమార్, మేకల సారంగపాణితోపాటు పలువురు పాల్గొన్నారు.