Three people died due to Thunder Storm : భూపాలపల్లి జిల్లాలో విషాదం పిడుగుపాటుకు ముగ్గురు మృతి.. - పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి
Published : Sep 5, 2023, 5:22 PM IST
Three people died due to Thunder Storm in Bhupalpally: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని చిట్యాల మండలం శాంతినగర్ గ్రామానికి చెందిన సరిత, మమత మిరప చేనులో పనులు చేసుకుంటున్న సమయంలో పిడుగుపాటు(Thunder Storm)కు గురై మృతి చెందారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారిగా ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదే జిల్లాలోనే.. కాటారం మండలంలోనూ ఓ రైతు పిడుగు పాటుకు గురై చనిపోయాడు. దామెరకుంట గ్రామంలో పొలంలో కలుపు తీస్తున్న రాజేశ్వరరావు అనే రైతుపై పిడుగు పడగా.. అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. జిల్లాలో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కొనసాగుతున్నాయి. వర్షాలు పడినప్పుడు పిడుగులు పడే అవకాశం ఉంటుందని.. జాగ్రత్తగా ఉండాలని.. ముఖ్యంగా చెట్ల నీడలో ఉండరాదని నిపుణులు సూచిస్తున్నారు.