Published : Jan 8, 2024, 4:12 PM IST
మద్యం దుకాణాన్ని తీసివేయాలంటూ వస్త్ర వ్యాపారి ఆత్మహత్యాయత్నం - కలెక్టరేట్లో వ్యాపారుల ఆందోళన
Textile Traders protest at collectorate :కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని గాంధీ రోడ్డులో వైన్ షాప్ ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అశోక్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అతణ్ని అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వస్త్ర దుకాణాల మధ్య వైన్ షాప్కు అనుమతిస్తే తమ అందరికీ ఆత్మహత్యనే శరణ్యమంటూ వస్త్ర వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
Textile Traders Protest on Wine Shop :మద్యం దుకాణం పెట్టే ప్రాంతంలో ఒక వైపు పాఠశాల, మరోవైపు దేవాలయం ఉందని, దీనికి ప్రభుత్వం ఎలా అనుమతిస్తుందని వస్త్ర వ్యాపారులు ప్రశ్నించారు. మద్యం దుకాణాన్ని నెలకొల్ప వద్దంటూ గతంలో పలుమార్లు ఎక్సైజ్ శాఖ అధికారులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. జిల్లాలోని మహిళలు పెద్ద మొత్తంలో గాంధీ రోడ్డుకు వచ్చి చీరలను కొనుగోలు చేస్తారని, ఈ నేపథ్యంలో మద్యం దుకాణానికి అనుమతి ఇవ్వడం తమ వ్యాపారానికి విఘాతం కలుగుతుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వస్త్ర వ్యాపారులు కోరారు.