తొలిరోజు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు
Published : Dec 9, 2023, 1:24 PM IST
Published : Dec 9, 2023, 1:24 PM IST
Telangana Assembly Session 2023 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి చేరుకున్నారు. ముందుగా బీజేపీ ఎమ్మెల్యేలు చేరుకున్న కొంత సేపటికే మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, మల్లా రెడ్డి సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. అనంతరం కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం వివేక్ తదితరులు స్థూపానికి వందనం చేసి అసెంబ్లీకి వెళ్లారు.
Traffic jam in front of Assembly : ఎమ్మెల్యేల రాకతో అసెంబ్లీ ఎదుట భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ట్రాఫిక్లోనే గాంధీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు వచ్చారు. రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేయడానికి చాలా మంది పోలీసులు డ్యూటీలో ఉన్నా ట్రాఫిక్ నియంత్రించడంలో పూర్తి విఫలమయ్యారు. ఇది గ్రహించిన హైదరాబాద్ నగర ట్రాఫిక్ అదనపు పోలీసు కమిషనర్ సుధీర్ బాబు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం రోజు కూడా ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపించింది. రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు, అతిథులు కూడా ట్రాఫిక్లో చిక్కుకుపోయారు.