తమిళనాడులో వరదల బీభత్సం- జనజీవనం అస్తవ్యస్తం,హెలికాప్టర్ల ద్వారా ఆహారం పంపిణీ - tamil nadu flood news
Published : Dec 21, 2023, 8:46 AM IST
|Updated : Dec 21, 2023, 9:07 AM IST
Tamil Nadu Flood 2023 : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలకు వరద నీరు చేరింది. వరదలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్గార్డ్ సిబ్బంది. హెలికాఫ్టర్ల ద్వారా వరద బాధితులకు ఆహారం అందించారు.
దక్షిణ తమిళనాడులో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఇండియన్ కోస్ట్గార్డ్ పడవతో వెళ్లి లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద బాధితులకు హెలికాప్టర్ల ద్వారా 600 కేజీల ఆహార పొట్లాలను అందించారు అధికారులు. మరోవైపు కోస్ట్గార్డ్ ఈస్ట్ రీజియన్ కమాండర్ జనరల్ ఐజీ డొన్ని మైఖెల్ డిసెంబర్ 20న సహాయక చర్యలను పర్యవేక్షించారు.
మరోవైపు, తమిళనాడు పశుసంవర్థకశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్, ఆయన సిబ్బంది వరదనీటిలో చిక్కుకున్నారు. ఆయన స్వగ్రామమైన తాండుపట్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మెసేజ్ ద్వారా తన పరిస్థితిని ఆయన బంధువులకు తెలియజేశారు. దీంతో తిరునల్వేలి డీసీపీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.