President Speech at Dundigal Air Force Academy : 'ఫైటర్జెట్ పైలట్లలో మహిళలు ఉండటం సంతోషకరం' - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజా ప్రసంగం
President Speech at Combined Graduation Parade : హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ఏర్పాటు చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి.. ఫైటర్జెట్ పైలట్లలో ఎక్కువ మంది మహిళలు ఉండటం సంతోషకరమన్నారు. కంబైన్డ్ గ్యాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్న ముర్ము.. క్యాడెట్లకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి సేవలను క్యాడెట్లు గుర్తుంచుకోవాలని సూచించిన ఆమె.. టర్కీ భూకంప సహాయక చర్యల్లో మన వాయుసేన బాగా పని చేసిందని కితాబిచ్చారు. కరోనా సమయంలోనూ వాయు సేన అద్భుతంగా పని చేసిందని రాష్ట్రపతి కొనియాడారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే సుఖోయ్ జెట్లో ప్రయాణం గొప్ప అనుభూతి ఇచ్చిందని రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. పరేడ్కు రివ్యూయింగ్ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కార్యక్రమంలో వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సత్యవతి రాఠోడ్, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ పాల్గొన్నారు.