Panchayatiraj National Awards 2023: దిల్లీలో పంచాయతీరాజ్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రదానోత్సవంలో తెలంగాణ పల్లెలు మెరిశాయి. 2023 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 46 అవార్డుల్లో.. రాష్ట్రం 13 దక్కించుకుంది. 8 విభాగాల్లో అవార్డులు అందజేశారు. హెల్తీ పంచాయత్, వాటర్ సఫిషియెంట్, సోషియల్లీ సెక్యూర్డ్ పంచాయతీ, గ్రామ్ ఊర్జా స్వరాజ్ విశేష్ కేటగిరీల్లో తెలంగాకు మొదటి ర్యాంకులు లభించాయి. ఈ మేరకు దిల్లీ విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, కలెక్టర్లు అవార్డులు అందుకున్నారు.
అవార్డులు సాధించిన గ్రామాలకు రాష్ట్రపతి అభినందనలు తెలిపారు. పల్లె ప్రగతి సాధించడానికి ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సూచించారు. జాతీయ స్థాయిలో అత్యధిక అవార్డులు తెలంగాణకు రావటం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు. ఉత్సవాల్లో మాట్లాడిన ఆయన పల్లె ప్రగతి కార్యక్రమం కింద 9 టీమ్లు పని చేస్తున్నాయన్నారు. భవిష్యత్తులో తెలంగాణ గ్రామాభివృద్ధి కోసం సమర్థవంతంగా పని చేస్తామన్నారు.