సంప్రదాయం కంటిన్యూ- అనంత పద్మనాభస్వామి గుడి సరస్సులోకి కొత్త మొసలి- ఎలా వచ్చిందో తెలియదట! - అనంతపద్మనాభ స్వామి ఆలయం మొసలి మృతి
By PTI
Published : Nov 12, 2023, 6:25 PM IST
New Crocodile In Ananta Padmanabha Swamy Temple : కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఉన్న ప్రఖ్యాత అనంత పద్మనాభస్వామి ఆలయ సరస్సులో కొత్త మొసలి ప్రత్యక్షమైంది. శాకాహార మొసలి 'బబియా' మరణించిన ఏడాది తర్వాత మరో మొసలి కనపడింది. అయితే ఈ మొసలిని నవంబర్ 8వ తేదీన గుర్తించి కొందరు భక్తులు తమకు చెప్పినట్లు ఆలయ అధికారులు తెలిపారు. తాము కూడా మొసలిని శనివారం పరిశీలించినట్లు చెప్పారు. ప్రధాన పూజారికి విషయాన్ని తెలియజేశామని, ఏం చేయాలో ఆయనే నిర్ణయించనున్నట్లు వెల్లడించారు.
ఒక మొసలి చనిపోయిన తర్వాత కొద్దిరోజులకు అనివార్యంగా మరో మొసలి సరస్సులో ప్రత్యక్షమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదని చెప్పారు. అలా ఇప్పుడు గుర్తించిన మొసలి నాలుగోది అని వెల్లడించారు. మూడో మొసలి బబియా గతేడాది మరణించినట్లు తెలిపారు.
"ఒకప్పుడు సరస్సులో పెద్ద మొసలి ఉండేది. ఆంగ్లేయులు ఆ మొసలిని కాల్చి చంపారు. ఆ తర్వాత అదే సరస్సులో మరో మొసలి కనిపించింది. అది కూడా చనిపోయాక 'బబియా' వచ్చింది. అసలు ఆ మొసలి ఎలా వచ్చిందనేది ఎవరికీ తెలియదు. పైగా దానికి బబియా అనే పేరు ఎవరు పెట్టారో కూడా తెలియదు. కానీ అది ఎప్పుడూ క్రూరంగా ప్రవర్తించలేదు. సరస్సులో ఉండే చేపలను కూడా తినలేదు" అని ఓ పూజారి తెలిపారు.