పట్టపగలే ఎంత పనిచేశావయ్యా - బైక్ బ్యాగ్లో నుంచి డబ్బు కాజేసిన దొంగ - Yadadri Crime News
Published : Dec 6, 2023, 2:10 PM IST
Money theft in Bhuvanagiri District : ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన చోరీలకు పాల్పడుతూ దొంగలు రెచ్చిపోతున్నారు. సులభంగా దొంగతనం చేసి ఆర్థికంగా లాభపడాలని దొంగలు భావిస్తున్నారు. చోరీలు చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. డబ్బుతో పాటు బంగారం వంటి ఖరీదైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. పక్కాగా ప్రణాళికలు రచించి, వాటిని అమలు పరుస్తున్నారు. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఓ వ్యక్తి పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డాడు.
భువనగిరిలో ఓ ప్రాంతంలోపార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్ర వాహనం బ్యాగ్లోంచి దుండగులు నగదు దోచుకెళ్లారు. బీబీ నగర్ మండలం రావి పహాడ్కి చెందిన వెంకటేశ్ బ్యాంక్ నుంచి లక్ష 86 వేల రూపాయలను డ్రా చేసి బైక్ బ్యాగ్లో భద్రపరిచాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తూ మార్గమధ్యలో పశువుల కోసం ఔషధాలు తీసుకుందామని ఓ మందుల దుకాణం వద్ద ఆగాడు. బైక్ను షాపు ముందు నిలిపి షాపులోనికి వెళ్లాడు. మందులు తీసుకుని వచ్చి బైక్ బ్యాగులో డబ్బు మాయమవ్వడం గమనించాడు. వెంటనే చుట్టుపక్కలంతా చూశాడు. ఎక్కడా కనిపించకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.