Published : Jan 16, 2024, 7:43 PM IST
గుర్రంతో వెల్కమ్ చెప్పిన గ్రామస్థులు - అభిమానానికి ఫిదా అయిన ఎమ్మెల్యే
MLA Payal Shankar Horse Rally in Adilabad : ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సారథిగా గుర్రంపై చేసిన సవారీ ఆకట్టుకుంది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత పాయల్ శంకర్ మొదటిసారి బేల మండలం కొగ్దూర్కు వెళ్లారు. వినూత్న రీతిలో గుర్రంతో ఎదురొచ్చిన కొగ్దూర్ గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. డీజే, డప్పు వాయిద్యాల మధ్య విజయోత్సవ ర్వాలీ నిర్వహించారు. అనంతరం పాయల్ శంకర్ను గుర్రంపై కూర్చోబెట్టి ఊరేగించారు. మధ్యలో గుర్రాన్ని కాసేపు నాట్యం చేయించారు.
గుర్రం నాట్యం చేసింది చూసి ఓ దశలో భయపడిన అభిమానులు, ఎమ్మెల్యే జారి పడకుండా పట్టుకునే ప్రయత్నం చేశారు. గుర్రం మాత్రం మేళతాళాలకు అనుగుణంగా, లయబద్ధంగా నృత్యం చేసి ఆకట్టుకుంది. గ్రామస్థుల అభిమానానికి మురిసిపోయిన ఎమ్మెల్యే పాయల్ శంకర్, గ్రామాన్ని మరచిపోనని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఎలాంటి సమస్యలొచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.