సాగర తీరాన వెలసిన అద్భుతం.. అంబేడ్కర్ విగ్రహం - stupa of immortals ambedkar statue in hyderabad
Vemula Prashanth reddy on Ambedkar Statue: పాలకులు, అధికారులు, ఉద్యోగులందరిలోనూ నిత్యం స్ఫూర్తి నింపేలా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని... సచివాలయం పక్కనే కొలువుదీరిందని రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సాగర తీరాన అద్భుతమైన విగ్రహం సిద్ధమైందన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని విగ్రహాన్ని సిద్ధం చేశామన్న మంత్రి వెల్లడించారు. విగ్రహం ముందు ప్రజలు సెల్ఫీలు తీసుకుంటుంటే.... ఇన్నాళ్లు పడిన కష్టం మరిచిపోయామని... చాలా సంతృప్తిగా ఉందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు.
"ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా ఆర్ అండ్ బీ విభాగానికి అప్పజెప్పినందుకు ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. 125 అడుగుల ఎత్తుగల కాంస్య విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. అంబేడ్కర్ దేశంలోనే గొప్ప వ్యక్తి ఎలానో ముఖ్యమంత్రి ఆలోచన కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఇంత గొప్ప నిర్ణయం తీసుకుని దానిలో భాగస్వామ్యం కల్పించారు. ఆయన ఏదైన ఊహిస్తే అది కార్యరూపం దాల్చకుండా ఉండదు. మంత్రులు, సీఎం ఎవరైనా సెక్రటేరియట్ వచ్చినప్పుడు అంబేడ్కర్, అమరవీరుల స్థూపం చూసినప్పుడు వారి త్యాగం, ప్రజల కోసం వారు చేసిన కృషి తెలియాలని నెక్లెస్ రోడ్డులో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది చాలా మనసు లగ్నం చేసి చేసిన కార్యక్రమం. అందుకే ఇంత గొప్పగా వచ్చింది. ప్రజలందరూ వచ్చి విగ్రహం ముందు సెల్ఫీలు తీసుకుంటే ఆ ఆనందం ముందు మా కష్టం ఓ లెక్క కాదనిపిస్తోంది." - వేముల ప్రశాంత్ రెడ్డి, రహదార్లు, భవనాల శాఖ మంత్రి