Published : Sep 1, 2023, 3:16 PM IST
Minister Koppula Reaction on Congress : 'ఎన్నికలు వచ్చినప్పుడే వారికి దళితులు గుర్తుకొస్తారు.. ఆ డిక్లరేషన్ ఓ బూటకం'
Minister Koppula Reaction on Congress SC Declaration : ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన దళిత (ఎస్సీ, ఎస్టీ) డిక్లరేషన్పై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించారు. ఈ డిక్లరేషన్ ఒక బూటకమని మంత్రి దుయ్యబట్టారు. హస్తం పార్టీ ఎస్సీలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ఈ డిక్లరేషన్ను జాతీయ స్థాయిలో ప్రకటిస్తారా అని ప్రశ్నించారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడే కాంగ్రెస్కు ఎస్సీలు గుర్తుకు వస్తారని.. హస్తం నేతల మాయమాటలు నమ్మి దళిత బిడ్డలు మోసపోవద్దని సూచించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు.
'ఎస్సీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు. దళిత డిక్లరేషన్ ఒక బూటకం. ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్కు ఎస్సీలు గుర్తుకు వస్తారు. మల్లికార్జున ఖర్గే తొలుత జాతీయ స్థాయిలో ఈ ప్రకటన చేయాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రకటన చేయాలి. ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ నేతల మాయమాటల నమ్మి.. దళిత బిడ్డలు మోసపోవద్దు' అని మంత్రి స్పష్టం చేశారు.