Lorry Falls into Quarry Canal in Mulugu : క్వారీ కాల్వలోకి దూసుకెళ్లిన లారీ.. తండ్రీకుమారుల దుర్మరణం - telangana latest news
Published : Oct 11, 2023, 12:42 PM IST
Lorry Falls into Quarry Canal in Mulugu : లారీ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో తండ్రీకుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ములుగు జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన డ్రైవర్ మమమ్మద్ సాదిక్ పాషా, తన కుమారుడు అశ్రఫ్తో కలిసి లారీలో మట్టి కోసం ములుగు ప్రాంతానికి వెళ్లారు. అబ్బపూర్ గ్రామ పరిధిలోని బాణాలపల్లి శివారులో గల మైనింగ్ క్వారీలోకి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు లారీ అదుపు తప్పింది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న క్వారీ కాల్వలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో లారీలో ఉన్న సాదిక్ పాషాతో పాటు కుమారుడు అశ్రఫ్ గల్లంతయ్యారు. కాల్వలో లారీ పడిపోవటాన్నిగమనించిన స్థానికులు.. కాల్వ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇద్దరి ఆచూకీ ఎంతకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో గాలించి అతికష్టమ్మీద ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.